ఇరాన్ నూతన అత్యున్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారా? అసలు ఆయన ఎక్కడున్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానంతరం బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడుస్తున్నా ఆయన ప్రజల ముందుకు రాకపోవడంతో ఈ ప్రశ్నలు అంతర్జాతీయ రాజకీయ వర్గాలను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి.
“అతను బతికున్నాడో లేదో కూడా మాకు తెలియదు” అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో మొజ్తబా నుంచి తాజాగా ఓ కొత్త సందేశం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమెరికా, ఇజ్రాయెల్తో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో తమకు మద్దతుగా నిలుస్తున్న ఇరాక్పై మొజ్తబా ఖమేనీ ప్రశంసలు కురిపించారు. ఇరాక్లోని మత పెద్దలు, ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన లిఖితపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ‘ఇస్నా’ ఆదివారం ప్రకటించింది. ముఖ్యంగా, షియా ప్రపంచంలో అత్యంత గౌరవనీయులైన గ్రాండ్ అయతొల్లా అలీ సిస్తానీ వైఖరిని ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. బాగ్దాద్లోని ఇరాన్ రాయబారి ఈ సందేశాన్ని ఇరాక్ ప్రభుత్వ వర్గాలకు అందజేశారు.
ఫిబ్రవరి 28న జరిగిన వైమానిక దాడిలో అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. అదే దాడిలో మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, అందుకే ఆయన కోలుకోవడానికి సమయం పడుతోందని, అందువల్లే ప్రజల ముందుకు రావడం లేదని టెహ్రాన్ వర్గాల అనధికారిక కథనం. సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన రెండుసార్లు సందేశాలు ఇచ్చినా, వాటిని టీవీలో ఇతరులే చదివి వినిపించారు. ఆయన స్వయంగా కనిపించకపోవడంతో ఆరోగ్యంపై ఊహాగానాలు బలపడ్డాయి.
ఇదే సమయంలో, మొజ్తబా ఉనికిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ ఉత్కంఠను మరింత పెంచాయి. “మేం ఇరాన్తో చర్చలు జరుపుతున్నాం. కానీ అది సుప్రీం లీడర్తో కాదు. ఆయన కుమారుడి (మొజ్తబా) నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. అతను బతికున్నాడో లేదో కూడా తెలియదు,” అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మొత్తంమీద, ఈ తాజా సందేశం ద్వారా మొజ్తబా క్రియాశీలకంగానే ఉన్నారని చెప్పే ప్రయత్నం ఇరాన్ చేసినప్పటికీ, ఆయన స్వయంగా ప్రజల ముందుకు వచ్చి ప్రసంగించే వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి, భద్రతపై నెలకొన్న ఉత్కంఠకు మాత్రం తెరపడదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.