జాతీయ రాజకీయ వార్తలు

ఇది తమిళనాడుకు – ఢిల్లీకి మధ్య జరుగుతున్న యుద్ధం: విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో… విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై పదునైన విమర్శలతో విరుచుకు పడుతున్నాయి. తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

“మేము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం. మా ముఖ్యమంత్రి చెప్పింది చేశారు, చేస్తూనే ఉన్నారు. కొత్తగా మరిన్ని వాగ్దానాలు చేశాం, వాటిని కూడా అమలు చేస్తాం. ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు” అని పేర్కొన్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, కొత్త మిత్రపక్షాలు డీఎంకే కూటమిలోకి చేరడం తమ బలానికి నిదర్శనమని అన్నారు.

నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీపై స్పందిస్తూ, ఆయన నేరుగా విమర్శలకు దిగకుండానే తనదైన శైలిలో సమాధానమిచ్చారు. “అసలైన పోరాటం తమిళనాడుకు, ఢిల్లీకి (కేంద్రంలోని బీజేపీ) మధ్య జరుగుతోంది” అని వ్యాఖ్యానించారు. భావజాల పరంగా ఇది రాష్ట్ర హక్కుల కోసం జరుగుతున్న యుద్ధమని అభివర్ణించారు.

శాంతిభద్రతలు, మహిళల భద్రతపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఉదయనిధి తోసిపుచ్చారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎంత కఠినంగా స్పందించిందనేది ముఖ్యమని, తమ హయాంలో కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పారు. మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం, విద్యార్థులకు తోడ్పాటు వంటి పథకాలు తమకు అండగా నిలుస్తాయన్నారు. అంతేకాకుండా, గృహోపకరణాల కొనుగోలు కోసం రూ.8,000 విలువైన కూపన్లు ఇస్తామన్న హామీ ఓటర్లను ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమి ఒకవైపు, నటుడు విజయ్ కొత్త పార్టీ మరోవైపు సత్తా చాటాలని చూస్తుంటే… డీఎంకే మాత్రం తన ‘సంక్షేమ బాట’తో అధికారాన్ని నిలబెట్టుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది.

Related posts

 హర్యానాలో బీజేపీ గెలుపు… కాంగ్రెస్, ఠాక్రే శివసేన మధ్య మాటల యుద్ధం!

Ram Narayana

రాష్ట్రపతి పాలన విధిస్తే…: లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలకు ఢిల్లీ మంత్రి కౌంటర్

Ram Narayana

మోదీని మహాత్మాగాంధీతో పోల్చిన ఉప రాష్ట్రపతి.. ఇంతకుమించి సిగ్గులేనితనం మరోటి ఉండదన్న కాంగ్రెస్

Ram Narayana