‘తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర’గా బండి సంజయ్ పాదయాత్ర!
-తెలంగాణలో ఈ నెల 24 నుంచి పాదయాత్ర
-భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభం
-పలు జిల్లాల మీదుగా పాదయాత్ర
2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ అందుకు తగ్గట్లుగా కార్యాచరణ రూపొందిస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు . ఈ పాదయాత్రకు ప్రజా సంగ్రామ యాత్రగా కూడా మమకారం చేశారు. ఇప్పటికే వివిధ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ కన్నా ముందంజలో ఉన్న బీజేపీ రానున్న కాలంలో మరింత పకడ్బందీ వ్యూహాన్ని అమలు జరపాలని అనుకుంటున్నా విషయం విదితమే . తెలంగాణాలో లో బీజేపీ నమ మాత్రమైనా పలుకుబడిని కలిగి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ యస్ వ్యతిరేక ఓట్లను తమకు అనుకూలంగా గంపగుత్తగా వేయించుకోవాలని ఎత్తుగడలు వేస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో చేయబోయే ప్రజా సంగ్రామ యాత్ర తమకు అనుకూలిస్తుందనే ఆశతో ఉంది.
తెలంగాణలో ఈ నెల 24 నుంచి పాదయాత్ర చేస్తానని ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర పేరును ఖరారు చేశారు. ‘తెలంగాణ ప్రజా సంగ్రామ యాత్ర’గా దీనికి పేరు పెట్టారు.
హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభం అయ్యే ఈ యాత్ర హుజూరాబాద్ వరకు కొనసాగుతుంది. తొలిదశలో సుమారు రెండు నెలల పాటు బండి సంజయ్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ యాత్ర ద్వారా కృషి చేస్తారు.
ఇక ఈ నెల 24న భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర మెహదీపట్నం మీదుగా షేక్పేటకు చేరుకోనుంది. తదుపరి రోజు గోల్కొండ కోట వద్ద జరిగే సభలో బండి సంజయ్ పాల్గొంటారు. ఆ తర్వాత చేవెళ్ల మీదుగా మన్నెగూడ, వికారాబాద్, సదాశివపేట తదితర ప్రాంతాల ద్వారా మెదక్ చేరుకుంటారు.
అక్కడి నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో వారం రోజుల పాటు ఆయన పాదయాత్రతో పర్యటిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. పాదయాత్ర విజయవంతానికి బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేశారు.