మనుషుల్లాగే జంతువుల్లోనూ ఆధిపత్య పోరు, అంతర్యుద్ధాలు జరుగుతాయనడానికి ఉగాండాలోని ఓ ఘటనే నిదర్శనం. అక్కడి కిబాలే నేషనల్ పార్కులో ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావించే ఓ చింపాంజీల సమూహం రెండుగా చీలిపోయి, దశాబ్ద కాలంగా భీకరంగా పోరాడుకుంటోంది. ఒకప్పుడు ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉన్న ఈ జీవాలు, ఇప్పుడు శత్రువులుగా మారి ఒకదానినొకటి చంపుకుంటుండటం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
‘న్గోగో’గా పిలిచే ఈ చింపాంజీల గుంపులో 200కు పైగా జీవాలు ఉండేవి. 2016 వరకు ఇవి కలిసే ఉండేవి. కానీ ఆ తర్వాత ‘సెంట్రల్’, ‘వెస్టర్న్’ అనే రెండు వర్గాలుగా విడిపోయాయి. తమ సరిహద్దులను ఏర్పాటు చేసుకుని, గస్తీ కాస్తూ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ‘సైన్స్’ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, 2018 నుంచి ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 17 పిల్లలు సహా 24 చింపాంజీలు ప్రాణాలు కోల్పోయాయి. మరో 15 చింపాంజీలు గల్లంతయ్యాయి.
ఈ ఘటనపై అధ్యయనం చేసిన ఆరోన్ శాండెల్ అనే పరిశోధకుడు పలు కారణాలను విశ్లేషించారు. భారీ సంఖ్యలో చింపాంజీలు ఉండటంతో ఆహారం కోసం పోటీ పెరగడం, సమూహాన్ని కలిపి ఉంచే పెద్ద వయసు చింపాంజీలు చనిపోవడం, నాయకత్వ మార్పులు వంటివి ఈ చీలికకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. “ఒకప్పుడు చేతులు పట్టుకుని తిరిగిన చింపాంజీలు, ఇప్పుడు ఒకదాన్నొకటి చంపుకోవాలని చూడటం ఆవేదన కలిగిస్తోంది” అని శాండెల్ తెలిపారు. మతం, జాతి వంటి కారణాలు లేకుండానే కేవలం సామాజిక బంధాలు దెబ్బతినడంతోనే ఇంతటి యుద్ధం జరగడం, మానవ సంఘర్షణల మూలాలను అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.