ఆరోగ్యం

టీవీ చూస్తూ గడిపితే మతిమరుపు ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాల వెల్లడి…

గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. అయితే, అలా కూర్చున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారనే దానిపై మీ డిమెన్షియా (మతిమరుపు) ముప్పు ఆధారపడి ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. ఒకేచోట కూర్చుని మెదడుకు చురుకుదనాన్నిచ్చే పనులు చేసేవారితో పోలిస్తే, మెదడుకు ఎలాంటి పని చెప్పకుండా ఉండే పనులు చేసేవారిలో డీమెన్షియా ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.

అమెరికన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం స్వీడన్‌లో 20,000 మందికి పైగా పెద్దల నుంచి వివరాలు సేకరించారు. వారిలో టీవీ చూడటం, సంగీతం వినడం వంటి మెదడుకు పనిచెప్పని పనులు చేసేవారిని, అలాగే ఆఫీస్ పని, అల్లికలు, కుట్లు వంటి మెదడుకు పనిచెప్పే పనులు చేసేవారిని పరిశీలించారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వారిని విశ్లేషించగా, టీవీ చూడటం వంటి నిష్క్రియాత్మక పనులలో గడిపిన వారిలో డిమెన్షియా ఎక్కువగా కనిపించింది.

పరిశోధనలో మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రతి గంట మెదడుకు చురుకుదనాన్ని ఇచ్చే పని చేయడం వల్ల డిమెన్షియా ముప్పు 4 శాతం తగ్గుతుందని తేలింది. అలాగే, గంటసేపు టీవీ చూడటానికి బదులుగా మెదడుకు మేతనిచ్చే పని చేస్తే మతిమరుపు ముప్పు 7 శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు.

అయితే, ఈ అధ్యయనం 1997లో ప్రారంభమైందని, అప్పటికి స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ వంటివి అందుబాటులో లేవని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఫోన్లు, సోషల్ మీడియా వాడకం కూడా మెదడుకు పనిచెప్పని నిష్క్రియాత్మక పనుల కిందకే వస్తాయని, ఇవి మెదడు ఏకాగ్రతను దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెదడుకు నిరంతరం సవాలు విసరడం ద్వారా అది ఆరోగ్యంగా ఉంటుందని, కొత్త హాబీ, కొత్త భాష లేదా సంగీత వాయిద్యం నేర్చుకోవడం వంటివి ‘కాగ్నిటివ్ రిజర్వ్’ను పెంచి మెదడును చురుగ్గా ఉంచుతాయని డాక్టర్లు సూచిస్తున్నారు.

Related posts

మనిషి వెంట్రుకల నుంచి పాడైపోయిన పళ్లను రిపేర్ చేసే పేస్ట్!

Ram Narayana

ఇయర్ ఫోన్లు ఎక్కువగా వాడొద్దు.. ఆ తర్వాత మీ ఇష్టం.. తమిళనాడు ప్రజారోగ్యశాఖ హెచ్చరిక!

Ram Narayana

ఈ సంకేతాలు కనిపిస్తే కాలేయం విషతుల్యాలతో నిండిందని అర్థం..

Ram Narayana