మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్బల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. పుణే జిల్లాలో ఈరోజు ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా నిర్దేశించిన హెలిప్యాడ్లో కాకుండా దానికి సమీపంలో ఉన్న ఓ పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో స్వల్ప గందరగోళం నెలకొంది. అయితే, ఈ ఘటనలో మంత్రి సహా పైలట్కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అసలేం జరిగిందంటే..!
పురందర్ తాలూకాలోని ఖన్వాడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ స్థానిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి భుజ్బల్ హెలికాప్టర్లో బయలుదేరారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న చివరి క్షణాల్లో దాని రెక్కల గాలికి పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి పైకి లేచాయి. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘బ్రౌనౌట్’ ఎఫెక్ట్ అంటారు. ఈ కారణంగా పైలట్ కు హెలిప్యాడ్ కనిపించలేదు. దాంతో, హెలిప్యాడ్ పక్కనే ఉన్న వాహనాల పార్కింగ్ స్థలంలో ఖాళీగా ఉండడంతో అక్కడ హెలికాప్టర్ను ల్యాండ్ చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో హెలికాప్టర్ హెలిప్యాడ్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో సురక్షితంగా దిగుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొరపాటున ల్యాండింగ్ జరిగిందని గ్రహించిన స్థానిక పోలీస్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పైలట్కు సమాచారం అందించారు. ఆ తర్వాత హెలికాప్టర్ను తిరిగి సరైన హెలిప్యాడ్కు తరలించారు.
ముఖ్యంగా దుమ్ము ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో హెలికాప్టర్ ఆపరేషన్ల సమయంలో ‘బ్రౌనౌట్’ అనేది ఒక సాధారణ సవాల్ అని నిపుణులు చెబుతున్నారు. ల్యాండింగ్ సమయంలో పైలట్ను ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ స్వల్ప అంతరాయం తర్వాత మంత్రి భుజ్బల్ తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు ఎటువంటి విచారణకు ఆదేశించలేదని తెలుస్తోంది.