నా హత్యకు స్కెచ్ వేశారు… వాళ్లెవరో త్వరలోనే తెలుస్తుంది: వంగవీటి రాధా!
- నేడు వంగవీటి రంగా వర్ధంతి
- తనను చంపేందుకు రెక్కీ జరిగిందన్న రాధా
- తాను దేనికీ భయపడే వ్యక్తిని కానని స్పష్టీకరణ
- రంగా వర్ధంతి కార్యక్రమానికి హాజరైన మంత్రి కొడాలి నాని
![Vangaveeti Radha sensational comments](https://i0.wp.com/img.ap7am.com/fit-in/320x213/bimg/cr-20211226tn61c84dd1e9ac8.jpg?resize=320%2C213&ssl=1)
వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో వంగవీటి రాధా సంచలన విషయం వెల్లడించారు. తనను చంపేందుకు కొందరు కుట్ర పన్నారని, ఇటీవల రెక్కీ కూడా జరిగిందని అన్నారు. ఇది రాజకీయ వేదిక కాబట్టి ఆ విషయం ఇప్పుడు చెప్పలేనని, వాళ్లెవరో త్వరలోనే తెలుస్తుందని స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తులను అందరూ దూరం పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
అయితే తాను ప్రజల మధ్యన ఉండే మనిషినని, దేనికీ భయపడే వ్యక్తిని కానని రాధా ఉద్ఘాటించారు. కాగా, రాధా తండ్రి రంగా వర్ధంతి సభకు ఏపీ మంత్రి కొడాలి నాని, టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. వీరు ముగ్గురు గుడివాడ సమీపంలోని కొండలమ్మ తల్లి ఆలయంలో పూజలు చేశారు.
వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన వల్లభనేని వంశీ… రాధాతో మాటామంతీ
- ఒకే వేదికపై వంగవీటి రాధా, వల్లభనేని వంశీ
- ఇద్దరూ కలిసే రంగా విగ్రహానికి పూలమాల వేసిన వైనం
- సోషల్ మీడియాలో ఫొటోలు
![Vallabhaneni Vamsi Meets Vangaveeti Radha On The Sidelines Of Ranga Death Anniversary](https://i0.wp.com/img.ap7am.com/fit-in/320x213/bimg/cr-20211226tn61c8279e14658.jpg?resize=320%2C213&ssl=1)
విజయవాడ బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి వీరిద్దరూ పూలమాల వేశారు. అంతకుముందే రాధా కార్యాలయంలో వారు సమావేశమయ్యారు. ఇరువురి మధ్య రాజకీయ, వ్యక్తిగత విషయాలు చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే, ఏం చర్చించారన్నది మాత్రం తెలియరాలేదు. కొన్నాళ్లుగా అడపాదడపా కొన్ని కార్యక్రమాలకు హాజరవడం తప్పితే పెద్దగా ఫ్రేమ్ లో లేని రాధా… తాజాగా వల్లభనేని వంశీతో కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా రాధా మాట్లాడుతూ… వంగవీటి కుటుంబాన్ని ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 33 ఏళ్లుగా తన తండ్రి వర్ధంతిని అభిమానులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అటు వల్లభనేని వంశీ స్పందిస్తూ… ఆశయసాధన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు. చనిపోయినా జనం మనసుల్లో గుర్తుండిపోయే నేతలు ముగ్గురని, వారు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వంగవీటి రంగా అని అన్నారు.