అసదుద్దీన్ ఒవైసీకి ‘జెడ్’ కేటగిరీ భద్రత.. కేంద్రం నిర్ణయం !
- యూపీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ పై కాల్పులు
- క్షేమంగా బయటపడిన ఎంఐఎం అధినేత
- దాడి నేపథ్యంలో ఒవైసీ భద్రతపై కేంద్ర హోంశాఖ సమీక్ష
- తనకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతన్న అసదుద్దీన్
ఎంఐఎం చీఫ్, లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి మరింత పటిష్ఠ భద్రతను కేంద్రం కల్పించింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన కారుపై గురువారం దుండగులు కాల్పులు జరపడం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా తప్పించుకున్నారు. ఈ అంశాన్ని లోక్ సభలో ప్రస్తావిస్తానని ఆయన ప్రకటించారు.
దాడి నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ భద్రతను కేంద్ర హోంశాఖ సమీక్షించింది. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించేందుకు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జెడ్ కేటగిరీలో 22 మంది రక్షణ సిబ్బంది ఉంటారు. ఇందులో నాలుగు నుంచి ఆరుగురు ఎన్ఎస్జీ కమాండోలు, మిగిలిన వారు పోలీసు సిబ్బంది ఉంటారు.
మరోవైపు అసుద్దీన్ ఒవైసీ శుక్రవారం ఉదయం స్పందిస్తూ.. తాను భద్రతను ఎప్పుడూ కోరలేదని, కోరబోనని స్పష్టం చేశారు. ఎందుకంటే తన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. యూపీలో ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో హపూర్-ఘజియాబాద్ జాతీయ రహదారిపై జిరార్సి టోల్ ప్లాజా సమీపంలో సాయంత్రం 6 గంటల సమయంలో ఒవైసీపై దాడి జరింది.
అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసుల అప్రమత్తం
![alert in hyderabad](https://i0.wp.com/img.ap7am.com/fit-in/320x213/bimg/cr-20220204tn61fccc9e86273.jpg?resize=320%2C213&ssl=1)
నిన్న ఉత్తర్ప్రదేశ్లోని మీరట్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా రహదారిపై ఒక టోల్ ప్లాజా వద్ద తన కారుపై కాల్పులు జరిపారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపిన విషయం తెలిసిందే. ఆయన కారుపై నాలుగు రౌండ్ల ఫైరింగ్ జరగడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేసి పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
క్విక్ రియాక్షన్ టీం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ను ఈ రోజు ఉదయం నుంచి ఏర్పాటు చేశారు. శుక్రవారం ప్రార్థనల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. ఒవైసీపై కాల్పుల ఘటన గురించి సామాజిక మాధ్యమాల్లో పలు పోస్టులు రావడంతో ఐఎం నేతలు, కార్యకర్తలు, అభిమానుల దారుస్సలాంకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
ఇదిలావుంచితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తుండడంతో దాదాపు ఏడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.