ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం భారీ కేటాయింపులు!
- ఏపీ రాజధానిని అమరావతిగానే పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం
- అమరావతిలో సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లు
- ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి మరో రూ.1,123 కోట్లు
- 2022-23 కేంద్ర బడ్జెట్లో ప్రొవిజన్
ఏపీ రాజధాని అమరావతికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు భారీ కేటాయింపులు చేసింది. ఈ మేరకు 2022-23 బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రొవిజన్ పెట్టింది. ఇప్పటిదాకా ఏపీ రాజధాని ఏదో తెలియదన్నట్లుగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏపీ రాజధానిని అమరావతిగానే పేర్కొంటూ ఈ కేటాయింపులు చేయడం గమనార్హం. అంతేకాకుండా ఈ నిధులను రాజధాని అమరావతిలో ఏఏ పనులకు వినియోగించాలోనన్న విషయంపైనా కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
2022-23 కేంద్ర బడ్జెట్ ప్రొవిజన్ ప్రకారం.. ఏపీ రాజధాని అమరావతిలో సచివాలయం నిర్మాణానికి రూ.1,214 కోట్లు, రాజధాని అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,123 కోట్లను కేంద్రం కేటాయించింది. జీపీఓఏకు భూసేకరణ వ్యయాన్ని రూ.6.63 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. ఇదిలా ఉంటే.. బడ్జెట్లో కేటాయింపుల ప్రకారంగానే నిధులు విడుదలవుతాయన్న వాదనపై భిన్నాబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటాయింపులు మాత్రమే చేసి నిధులు విడుదల చేయని సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మరి రాజధాని అమరావతి నిర్మాణం కోసమంటూ మోదీ సర్కారు చేసిన ఈ కేటాయింపుల మేరకు నిధులను విడుదల చేయించుకునే విషయంలో జగన్ సర్కారు ఏ మేరకు సఫలమవుతుందో చూడాలన్న వాదన వినిపిస్తోంది.