Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తన యావదాస్తిని రాహుల్ గాంధీ పేరిట రాసిన 78 ఏళ్ల వృద్ధురాలు!

తన యావదాస్తిని రాహుల్ గాంధీ పేరిట రాసిన 78 ఏళ్ల వృద్ధురాలు!

  • ఉత్తరాఖండ్ లో ఘటన
  • రాహుల్ పై అభిమానం చూపిన పుష్ప ముంజియాల్
  • రూ.50 లక్షల విలువైన ఆస్తి, 10 తులాల బంగారం బదలాయింపు
  • కోర్టులో వీలునామా అందజేత

సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్. అయితే, గత రెండు పర్యాయాలు బీజేపీ ప్రభంజనంతో విపక్ష హోదాకే పరిమితమైంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న కాంగ్రెస్ అభిమానులకు నిరాశ తప్పలేదు. అయితే, ఓ వృద్ధురాలు మాత్రం రాహుల్ పై ఎనలేని నమ్మకం చూపుతుండడం విశేషం.

ఆమె పేరు పుష్ప ముంజియాల్. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన పుష్ప ముంజియాల్ వయసు 78 ఏళ్లు. తాజాగా ఈ వృద్ధురాలు జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఎందుకంటే, ఆమె తన యావదాస్తిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేరిట బదలాయించారు. తనకున్న రూ.50 లక్షల విలువైన ఆస్తులను, 10 తులాల బంగారాన్ని రాహుల్ కు రాసేశారు. ఈ మేరకు డెహ్రాడూన్ కోర్టులో తన వీలునామా సమర్పించారు.

తన ఆస్తులపై సర్వ హక్కులను రాహుల్ గాంధీకి బదిలీ చేస్తున్నట్టు ఆమె తన వీలునామాలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పుష్ప ముంజియాల్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ సేవలు, అతడి ఆలోచనలు దేశానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. రాహుల్ విధానాలతో తాను ఎంతగానో ప్రభావితమయ్యానని తెలిపారు. అందుకే అతడికి తన ఆస్తి రాసిచ్చానని వెల్లడించారు.

ఈ మేరకు అవసరమైన పత్రాలను ఆమె రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్ కు అందజేసినట్టు కాంగ్రెస్ నేత లాల్ చంద్ శర్మ తెలిపారు.

Related posts

సాయి గ‌ణేశ్ ఆత్మ‌హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ కోరుతూ… తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటిష‌న్‌!

Drukpadam

ఎస్సై పోస్టుల రాత ప‌రీక్ష‌ను మార్చాల‌ని ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ డిమాండ్‌…

Drukpadam

ఏపీ లో తెలుగు అకాడమీ పేరు మార్పుపై రాద్ధాంతం….

Drukpadam

Leave a Comment