లండన్లో కేటీఆర్… పారిశ్రామిక దిగ్గజాలతో రౌండ్ టేబుల్ సమావేశం
- యూకేబీఐసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
- నేతృత్వం వహించిన కేటీఆర్
- డెలాయిట్, జేసీబీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్, రోల్స్ రాయిస్ కంపెనీలు హాజరు
![ktr chaired a round table session organized by UKIBC in London](https://i0.wp.com/img.ap7am.com/cdn-cgi/image/width=320,quality=85,f=auto/bimg/cr-20220518tn6284cb6d21a8e.jpg?resize=320%2C213&ssl=1)
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. బ్రిటన్ రాజధాని లండన్లో పర్యటిస్తున్న ఆయన బుధవారం దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దెలాయిట్, జేసీబీ, హెచ్ఎస్బీసీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్, రోల్స్ రాయిస్ సహా మరిన్ని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ) ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ వెంట తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ఆయా కంపెనీలకు వివరించారు. రాష్ట్రంలో ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన వివరించారు. ఇక పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు తెలంగాణలో సమృద్ధిగా నీరు, భూమి, విద్యుత్తో పాటు మానవ వనరులు ఉన్న విషయాన్ని తెలిపారు. భారత్లోని ఏ ఒక్క రాష్ట్రం ఇవ్వలేనంత మేర ప్రోత్సాహకాలు తాము ఇస్తున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు.