Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పీసీసీ పదవి నుంచి రేవంతరెడ్డిని తప్పించనున్నారా …?

పీసీసీ పదవి నుంచి రేవంతరెడ్డిని తప్పించనున్నారా …?
ఇందులో కేసీఆర్ కుట్ర ఉందా
రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన వైనం
పీసీసీ అధ్యక్ష పదవి నుంచి నన్ను సాగనంపే కుట్ర జరుగుతుందన్న రేవంత్
టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయన్న రేవంత్ రెడ్డి
పార్టీ లో తాను బలహీన పడ్డానని చూపించాలని చూస్తున్నారు
సుపారీ కిల్లింగ్ ఒప్పందాలతో కాంగ్రెస్‌ను చంపాలనుకుంటున్నారు
26, 27లలో చండూరులో దీక్ష చేస్తానన్న రేవంత్

 

పీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డిని తప్పించనున్నారా ? రేవంత రెడ్డి నిర్వేదానికి కారణం ఏమిటి ? కాంగ్రెస్ లోని సీనియర్లు సహకరించడంలేదా ? కోమటి రెడ్డి వెంకట రెడ్డి ప్రచారంలో లేకుండా పోవడానికి రేవంత రెడ్డి మాటలే కారణమా ?  తెలంగాణ కాంగ్రెస్ లో ఏమి జరుగుతుంది… పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కళ్ళనీళ్లు పెట్టడానికి కారణమేమిటి ?….నిజంగా పెట్టారా లేక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా ? సానుభూతికోసం ప్రయత్నాలు చేస్తున్నారా ? అనేది చర్చనీయాంశంగా మారింది. అధికారం కోసం టీఆర్ యస్ ..బీజేపీ లు హోరా హోరి తలపడుతున్నాయి. బీజేపీకి తెలంగాణ లో పెద్దగా బేస్ లేకపోయినా 2023 జరిగే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని బల్ల గుద్ది మరి చెపుతున్నారు. బీజేపీ బలపడేందుకు ,కాంగ్రెస్ ను చంపడానికి కూడా టీఆర్ యస్ సిద్దపడింది. కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో 12 మందిని టీఆర్ యస్ లో కలుపుకొని కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. చివరకు కాంగ్రెస్ కిందిస్థాయి కార్యకర్తలను ,నేతలను కూడా వదలకుండా ప్రలోభాలకు గురిచేయడం టీఆర్ యస్ కు పరిపాటిగా మారింది. రెండవ టర్మ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ యస్ పై ప్రజల్లో భ్రమలు తొలుగుతున్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. రాష్ట్రంలో టీఆర్ యస్ కాకపోతే లెక్కప్రకారం కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ కావాలి .కానీ బీజేపీ కి అడ్వాంటేజ్ అవుతుంది . పైగా టీఆర్ యస్ ను బీఆర్ యస్ గా మార్చుతున్నట్లు కేసీఆర్ ప్రకటించిన తర్వాత గులాబీ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక కాంగ్రెస్ లోని కొందరి పీఠాలను కదిలించబోతుందనే అభిప్రాయాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాటలు దానికి మరింత బలాన్ని ఇచ్చాయి.

తనను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నిన్న మునుగోడులో విలేకరులతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేదని చూపించేందుకు టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు. ఫలితంగా తాను బలహీనపడ్డానని చూపించడం ద్వారా పీసీసీ అధ్యక్ష పదవి నుంచి సాగనంపేందుకు పన్నాగాలు పన్నుతున్నారని అన్నారు. అలాంటి వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని, ప్రశాంత్ కిశోర్ వ్యూహ రచనలో ముందుకు సాగుతున్నాయని విమర్శించారు. సుపారీ కిల్లింగ్‌ ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్‌ను చంపాలని చూస్తున్నారని అన్నారు.

చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పండి

కాంగ్రెస్‌ను చంపేందుకు ఆ రెండు పార్టీలు చేయని ప్రయత్నాలంటూ లేవని, మునుగోడులో డబ్బు, మద్యం పంపకం ద్వారా ఓట్లు సాధించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్‌రెడ్డి, ఇలాంటి వారికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు. మునుగోడు సమస్యల పరిష్కారానికి ఈ నెల 26, 27 తేదీల్లో చండూరులో దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు. అనుమతి కోసం ఎన్నికల కమిషన్‌ను కోరతానన్నారు.

మద్యం పంచకుండా గెలవగలరా?

బ్యాలెట్ పేపర్‌లో టీఆర్ఎస్‌ రెండో స్థానంలో ఉండడంపై అభ్యంతరం తెలిపిన రేవంత్.. జాతీయ పార్టీలు మాత్రమే బ్యాలెట్ పేపర్‌లో ముందుండాలని అన్నారు. అధికార పార్టీ నేతలు ప్రభుత్వ వాహనాలను ఉపయోగిస్తూ ప్రచారం చేస్తున్నారని, వాటిని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో విధుల్లో ఉన్న పోలీసుల వివరాలను డీజీపీ ప్రకటించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మునుగోడులో మద్యం పంపిణీ చేయకుండా గెలిచే దమ్ము టీఆర్ఎస్, బీజేపీకి ఉందా? అని సవాలు విసిరారు.

రాజగోపాల్‌రెడ్డి బొడ్డులో కత్తి

కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతితో కలిసి గత రాత్రి మర్రిగూడ మండలంలో రోడ్‌షో నిర్వహించిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలను ఫిరాయించే రాజగోపాల్‌రెడ్డి లాంటి దొంగలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని చంపేందుకు రాజగోపాల్‌రెడ్డి బొడ్డులో కత్తి పెట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. మునుగోడులో పార్టీని కాపాడుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ తరలిరావాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Related posts

కమ్మోళ్లను హేళన చేస్తున్నారు…జగన్ పై రేణుకాచౌదరితీవ్ర   వ్యాఖ్యలు!

Drukpadam

బీఆర్ఎస్ సభకు కుమారస్వామి, నితీశ్ కుమార్ రాకపోవడంపై బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Drukpadam

తెనాలి నుంచి నాదెళ్ల మనోహర్ ను గెలిపించండి …పవన్ కళ్యాణ్ పిలుపు

Ram Narayana

Leave a Comment