మధిర లో లింగాల కు 4 వసారి పరీక్ష కు అవకాశం ఉంటుందా …?
–ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా ఉన్న లింగాల కమల్ రాజ్
–మధిర సీటు బలంగా ఆశిస్తున్నా కమల్ రాజ్
–అందుకే మధిర పై ఫోకస్ …పార్టీ ఇంచార్జి గా ఆయనే
–ఆయనకు టికెట్ వస్తుందా ? రాదా అనే సందేహాలు
–కొత్తవారికోసం పార్టీ అన్వేషిస్తుందనే అభిప్రాయాలు ?
–బీఆర్ యస్ టికెట్ ఆశిస్తున్న బమ్మెర , కోటా, పొంగులేటి శిభిరంలో
–అందువల్ల లింగాలకే అవకాశం అంటున్న నేతలు
–పొత్తుల్లో మధిర సీటు మాకే కావాలంటున్న సిపిఎం
–ఈసారి మధిరలో త్రిముఖ పోటీ తప్పదంటున్న పరిశీలకులు
లింగాల కమల్ రాజ్ బీఆర్ యస్ జిల్లా నాయకుడు ….ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ …ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్న కమల్ రాజ్ మూడుసార్లు మధిర ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఒడి పోయారు. నాలుగవసారి పోటీచేయాలని పట్టుదలతో ఉన్నారు . అయితే ఆయనకు మైనస్ ఏమిటంటే మూడుసార్లు ఓడిపోవడం . అందువల్ల పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అనే సందేహాలు ..ఇప్పటివరకు ఇక్కడ అధికార బీఆర్ యస్ నుంచి టికెట్ ఆశించిన బొమ్మెర రామ్మూర్తి , డాక్టర్ కోటా రాంబాబులు బీఆర్ యస్ కు దూరమైయ్యారు . అందువల్ల లింగాలకు లైన్ క్లియర్ గానే కనిపిస్తున్నా, మూడు సార్లు ఓడిపోయిడానే సెంటిమెంట్ టికెట్ అవకాశాలను దెబ్బతీస్తుంది.
కమల్ రాజ్ రెండుసార్లు సిపిఎం అభ్యర్థిగా పోటీచేయగా , ఒకేసారి మాత్రమే గులాబీ పార్టీ నుంచి పోటీచేశారు. విచిత్రమేమంటే మూడుసార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన మల్లు భట్టి విక్రమార్క చేతిలోనే ఓడిపోవడం గమనార్హం …గత ఎన్నికల్లో లింగాల కమల్ రాజ్ కోసం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డారు . అప్పుడు ఎంపీగా ఉన్న పొంగులేటి అధికార పార్టీ అండతో తానే పోటీచేస్తున్నంతగా ఊరూరూ తిరిగారు . ఆర్ధికంగా ,హార్దికంగా అండదండలు అందించారు . చివరివరకు లింగాల కమల్ రాజ్ గెలుస్తాడని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా భట్టి తన వ్యూహాలు , ఎత్తులతో వారంరోజుల్లోనే తనకు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోగలిగారు . హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకున్నారు .
భట్టి ఉమ్మడి రాష్ట్రంలో ఒకేసారి , తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రెండు సార్లు తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు .ప్రస్తుతం సీఎల్పీ నేతగా వ్యవరిస్తున్నారు . కమల్ రాజ్ కు కేసీఆర్ టికెట్ ఇస్తే తిరిగి భట్టి మీదనే పోటీచేయాల్సి ఉంటుంది. భట్టితో తలపడటం నాలుగవసారి అవుతుంది . మూడుసార్లు ఓడిపోయిన అభ్యర్థికి తిరిగి టికెట్ ఇస్తారా ?లేదా అనేది కేసీఆర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే మధిరలో ప్రస్తుతనానికి లింగాల కమల్ రాజ్ కన్న బలమైన అభ్యర్థి బీఆర్ యస్ కు కనిపించడంలేదు . ఏమైనా అనూహ్యమైన మార్పులు జరిగితే తప్ప కమల్ రాజ్ నే మధిర బీఆర్ యస్ అభ్యర్థి అవుతారు . సిపిఎం ,బీఆర్ యస్ పొత్తులో భాగంగా తమకు బలమైన మధిర ఎస్సీ రిజర్వుడ్ కావాలని కోరుతుంది . కేసీఆర్ సిపిఎం కు సీటు ఇవ్వాలనుకుంటే కమల్ రాజ్ ఆశలు గల్లంతు అవుతాయి.
కమల్ రాజ్ కు సౌమ్యుడిగా పేరుంది . భట్టికి రాజకీయ చాణిక్యుడిగా గుర్తింపు ఉంది. ఇద్దరు విద్యావంతులే … పొంగులేటి శిబిరం ఏ పార్టీలో చేరుతుందనేది ఇంకా తేలలేదు . అయితే ఆ శిబిరం నుంచి డాక్టర్ కోటా రాంబాబు పోటీచేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఆయన కూడా బలమైన అభ్యర్థి అవుతాడు .అప్పుడు త్రిముఖ పోటీ అనివార్యమైన పరిస్థితిలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది చెప్పడం కొంచం కష్టంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం . లింగాల ఈసారి ఎలాగైనా టికెట్ సాధించి గెలవాలనే ఆలోచనతో జడ్పీ చైర్మన్ గా మధిర నియోజకవర్గంపై కేంద్రీకరణ చేస్తున్నారు . భట్టి కూడా తనకున్న పలుకుబడిని ఉపయోగించి మధిర కు మంచి చేస్తున్నారనే పేరుంది . మధిర లో ఈసారి త్రిముఖ పోటీ అగ్నిపరీక్షగా మారె అవకాశం ఉంది …..!