Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పైలట్ సీటు కింద నాగుపాము.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

పైలట్ సీటు కింద నాగుపాము.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఘటన
  • విమానంలో గాల్లో ఉండగా తన సీటు కింద నాగుపామును గుర్తించిన పైలట్
  • చాకచక్యంగా విమానాన్ని దించేసిన వైనం
  • పైలట్ ప్రొఫెషనలిజంపై విమానరంగ నిపుణుల ప్రశంసలు

విమానం గాల్లో ఉండగా తన సీటుకింద నాగుపామును గుర్తించిన ఓ పైలట్ అత్యంత చాకచక్యంగా విమానాన్ని దించేశాడు. నాగుపాము విషయం తెలిసీ సంయమనం పాటిస్తూ విమానాన్ని జాగ్రత్తగా ల్యాండ్ చేసిన పైలట్‌పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. దక్షిణాఫ్రికాలో సోమవారం ఈ ఘటన వెలుగు చూసింది.

సోమవారం ఓ తేలికపాటి విమానం వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్‌కు బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్‌ ఎరాస్‌మస్‌కు తన నడుము వద్ద ఏదో కదులుతున్నట్టు అనిపించింది. తల తిప్పి చూడగా.. ఓ నాగుపాము తన సీటు కింద దూరుతూ కనిపించింది. ఆ దృశ్యం చూడగానే ఎరాస్‌మస్‌కు మతిపోయింది.

అయితే.. ధైర్యం కూడదీసుకున్న పైలట్ సంయమనంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు. ముందుగా నాగుపాము విషయాన్ని గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి తెలియజేసి ఆపై ప్లేన్‌ను జోహాన్నెస్ బర్గ్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పింది. విమానం దిగేటప్పుడు సీటు పైకి ఎత్తి చూడగా నాగుపాము చుట్టుచుట్టుకుని పడుకుని కనిపించిందని ఎరాస్‌మస్ చెప్పుకొచ్చాడు.

ప్రయాణానికి ముందు రోజే వార్సెస్టర్ ఎయిర్‌పోర్టు సిబ్బంది విమానం రెక్కల కింద నాగుపామును గుర్తించారు. దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉండగా పాము ఇంజిన్‌ కవర్ల కింద దూరిపోయింది. ఇంజిన్ తెరిచి చూసినా పాము కనిపించలేదు. దీంతో..అది వెళ్లిపోయి ఉంటుందని సిబ్బంది భావించారు. ఆ మరుసటి రోజే పాము అనూహ్యంగా కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైంది.

ఇక విమానం జోహాన్నెస్‌బర్గ్‌లో దిగాక కూడా పామును పట్టుకునేందుకు సిబ్బంది మరోసారి ప్రయత్నించి విఫలమయ్యారు. విమానాన్ని ఏకీలుకాకీలు ఊడదీసి చూసినా అది కనిపించలేదు. రాత్రి కావస్తుండటంతో ఆ రోజుకు తమ ప్రయత్నాలకు విరామం ఇచ్చారు. అయితే.. పామును బయటకు రప్పించేందుకు విమానం చుట్టూరా ఆహారాన్ని పెట్టారు. మరుసటి రోజు ఉదయం చూస్తే ఆ ఆహారాన్ని పాము తాకిన దాఖలాలు కనిపించలేదు. దీంతో.. పాము విమానం నుంచి బయటపడి వెళ్లిపోయి ఉంటుందని వారు భావిస్తున్నారు.

ఇలాంటి ఘటనను తాము ఎప్పుడూ చూడలేదని విమాన రంగ నిపుణులు చెబుతున్నారు. పైలట్ సంయమనంతో వ్యవహరించడంతో ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పిందని, అతడు ఏమాత్రం కంగారు పడి ఉన్నా విమానం అదుపు తప్పి ఘోర ప్రమాదం జరిగి ఉండేదని చెప్పుకొచ్చారు.

Related posts

తమిళనాడులో కూలిపోయిన హెలికాప్టర్ కు ఘన చరిత్ర!

Drukpadam

వడోదర నగరం వరద మయం …వీధుల్లోకి ముసళ్ల భీతిల్లిన ప్రజలు

Drukpadam

Drukpadam

Leave a Comment