నేను టీడీపీ గుర్తుతోనే గెలిచాను.. మరి చింతమనేని ఎందుకు ఓడిపోయాడు?: వల్లభనేని వంశీ
- కోడి పందేల కోసం పర్మిషన్ ఇప్పించాలని నానిని చింతమనేని అడిగారన్న వంశీ
- సొంత నియోజకవర్గ పరిస్థితిని చూసుకోవాలని హితవు
- రాజ్యసభ సీట్లను చంద్రబాబు అమ్ముకుంటారని ఆరోపణ
గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేసేందుకు 10 మంది పోటీ పడుతున్నారని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గన్నవరంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ… ముందు ఆయన నియోజకవర్గ పరిస్థితిని చూసుకోవాలని అన్నారు. వల్లభనేని వంశీ టీడీపీ తరపున గెలిచారన్న చింతమనేని వ్యాఖ్యలపై స్పందిస్తూ… తాను టీడీపీ గుర్తుపై గెలిచిన మాట నిజమేనని, అదే టీడీపీ గుర్తుతో చింతమనేని ఎందుకు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. కోడిపందేలు ఆడించుకోవడానికి పర్మిషన్ ఇప్పించాలని కొడాలి నానిని గతంలో చింతమనేని అడిగారని చెప్పారు.
తాను చంద్రబాబు స్కూల్ నుంచే వచ్చానని… ఎన్నికల సమయంలో రాజ్యసభ సీట్లను చంద్రబాబు ఎలా అమ్ముకుంటారో తమకు తెలుసని అన్నారు. గన్నవరం నుంచి పోటీ చేయాలని లోకేశ్ కు తాను గతంలోనే సవాల్ విసిరానని… తన సవాల్ పై ఆయన ఇంతవరకు స్పందించలేదని చెప్పారు. వైసీపీ వెంటిలేటర్ పై లేదని… టీడీపీనే వెంటిలేటర్ పై ఉందని అన్నారు.
గన్నవరం టీడీపీ టికెట్ కోసం 10 మంది పోటీపడుతున్నారు: చింతమనేని

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్ పై ఉందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ఏపీని నాశనం చేశారని దుయ్యబట్టారు. గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేయడానికి 10 మంది వరకు పోటీ పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో వైసీపీ సైకోలు తయారయ్యారని విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరంలో భూముల విలువ ఎంత ఉందో… ఇప్పుడు విలువ ఎంతో గమనించాలని చింతమనేని అన్నారు. గన్నవరం విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న విమానాల సంఖ్య కూడా తగ్గిపోయిందని చెప్పారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకుని రాజకీయ వ్యభిచారం చేసిన చరిత్ర జగన్ దని అన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని… బాబును గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.