తరుగు పేరుతో దోపిడి అరికట్టాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు…
#తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలి
#నెల రోజులు పైగా కాటాలు వేయని దుస్థితి
#మిల్లర్ల దోపిడీని అరికట్టాలి
#కాటావేశాక కూడా రైతులను భాద్యులని చేయడం దారుణం
ప్రతిగింజను కొనుగోలు చేస్తాం. అని ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు.
శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా కేంద్రంలోని హోల్టైమర్స్, ప్రజా సంఘాల బాధ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెలల తరబడి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు కాస్తున్నా కాటాలు వేయటం లేదన్నారు. కాటాలు వేసిన నెల రోజుల దాకా ధాన్యం ట్రాన్స్ ఫోర్టు చేయటం లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన తడిస్తే దానికి రైతునే బాధ్యుణ్ణి చేయటం దారుణమన్నారు. తేమ పేరుతో, తరుగు పేరుతో ఇష్టారాజ్యంగా రైతులను దోపిడి చేస్తున్నారని విమర్శించారు. నిబంధనల ప్రకారం మాత్రమే తరుగుతీయాలన్నారు. రైతులు ఆందోళనను బలహీనతగా చేసుకొని మిల్లర్లు అడ్డగోలుగా కోతపెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నా ప్రభుత్వ నోరు మెదపడం లేదన్నారు. సన్నధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఏడిపించటం సరికాదని అన్నారు. ప్రతి సంవత్సరం కొనుగోలు చేసే ధాన్యాన్ని ముందుచూపు, ప్లాను చేసుకోకుండా అసమర్థ చర్యలతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాటాలు వేశాక ధాన్యం భాద్యత రైతుకులేదని అధికారులే బాధ్యత వహించాలని నున్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాచర్ల భారతి, జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ. నందిపాటి మనోహర్, తుమ్మ విష్ణు, బండారు రమేష్, మాదినేని రమేష్, తుశాకుల లింగయ్య, నాయకులు ఎ.కె.మీరా, డి. తిరుపతిరావు, మెరుగు రమణ, గౌస్, అమరావతి తదితరులు పాల్గొన్నారు.