Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎవడ్రా మమ్మల్ని ఆపేది?: రేణుకా చౌదరి ఫైర్….

ఎవడ్రా మమ్మల్ని ఆపేది?: రేణుకా చౌదరి ఫైర్….
పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారన్న రేణుకా చౌదరి
బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా అని ప్రశ్న
మీటింగ్‌కు వెళ్లొద్దని ప్రజలకు డబ్బులిచ్చి అడుక్కుంటున్నారంటూ ఎద్దేవా

ఖమ్మం జిల్లాలో ఈ రోజు కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. అయితే సభకు వచ్చే వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రోడ్డుపై అడ్డుగా ఉన్న బారికేడ్లను తొలగించిన రేణుకా చౌదరి.. ‘‘మా ప్రజలు, మేము వెళ్తున్నాం.. నువ్వు ఎవడ్రా ఆపడానికి? బారికేడ్లు పెడితే భయపడిపోయి ఆగిపోతామా? పిచ్చి భ్రమలు. ఎవడ్రా మమ్మల్ని ఆపేది” అంటూ శివాలెత్తారు.

పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా అడ్డుకున్నారని, ఆర్టీసీ బస్సులు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అని విరుచుకుపడ్డారు. తమ కార్యకర్తలు నడిచైనా సరే సభకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

‘‘మేం పర్మిషన్లు అడిగాం.. నువ్వు ఇచ్చావు. ఇప్పుడు నువ్వు మనసు మార్చుకున్నావు.. కానీ మా మూడ్ ఇప్పుడు మారదు. నువ్వు బస్సులు ఇవ్వకపోతే పో.. వియ్ డోంట్ కేర్. కాళ్లతో నడిచి వస్తారు ప్రజలు. డబ్బులు ఇచ్చి మరీ మీటింగ్‌కు వెళ్లొద్దని చెబుతున్నారట అడుక్కుతినే ఎదవలు” అంటూ మండిపడ్డారు.

కాంగ్రెస్ జనగర్జన సభకు ప్రభుత్వమే అడ్డంకులు సృష్టించడం సరికాదు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
డబ్బులు కడతామన్నా ఆర్టీసీ బస్సులు ఇవ్వడంలేదన్న కోమటిరెడ్డి
ఇతర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారని ఆరోపణ
ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టీకరణ

నేడు ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభ జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సభకు వస్తున్నారు. అయితే ఖమ్మం సభకు బీఆర్ఎస్ అనేక అడ్డంకులు సృష్టిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీనిపై స్పందిస్తూ, కాంగ్రెస్ జనగర్జన సభకు ప్రభుత్వమే అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదని అన్నారు. రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడం ఏంటి? కేసీఆర్ కు చెప్పేదొక్కటే… ప్రజాస్వామ్యంలో విపక్షాలకు సభలు, పోరాటాలు, ధర్నాలు నిర్వహించుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.

డబ్బులు కడతామన్నా ఆర్టీసీ బస్సులను ఇవ్వలేదని, జనం ప్రైవేటు వాహనాల్లో సభకు వెళుతున్నా అడ్డుకుంటున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు.

“ఎక్కడ మీటింగులు జరిగినా ఆర్టీసీ బస్సులు ఉపయోగించుకోవడం సాధారణంగా జరిగే విషయమే. కానీ కాంగ్రెస్ జనగర్జన సభకు భయపడిన రాష్ట్ర ప్రభుత్వం బస్సులను ఇవ్వడంలేదు. ఇతర వాహనాలను కూడా ఆపేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇలా కక్ష గట్టి మరీ జనాన్ని కాంగ్రెస్ సభకు రాకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే సభను సజావుగా నడిపేందుకు పోలీసులకు తగిన సూచనలు చేయాలి… లేకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత ప్రభుత్వమే వహించాల్సి ఉంటుంది” అని కోమటిరెడ్డి హెచ్చరించారు.

తాము ప్రజల పక్షాన పోరాడేందుకు సభలు పెట్టుకుంటుంటే ఇలా నిర్బంధం తరహా చర్యలు సరికాదని హితవు పలికారు. ఆఖరికి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత నిరంకుశత్వాన్ని చూడలేదని అన్నారు. సొంత రాష్ట్రంలో ఈ నిర్బంధం ఏమిటి? అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహంతో ప్రశ్నించారు.

సీఎం ఆదేశాల మేరకు పోలీసులు ఇలా చేస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తోందని, ఏదైనా జరగరానిది జరిగితే తమకేం సంబంధం లేదని స్పష్టం చేశారు. గత తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ శ్రేణులను ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, అయినప్పటికీ తాము న్యాయపరంగా పోరాడుతున్నామే తప్ప హద్దు మీరలేదని చెప్పారు.

ఇప్పుడు లక్ష మంది సభకు వస్తుండడం చూసి ఓర్వలేక ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. ముందే హెచ్చరిస్తున్నాం… ఏం జరిగినా మాకేం సంబంధం లేదు… తెలంగాణ సమాజం అన్నీ గమనిస్తోంది అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్ఘాటించారు.

Related posts

వడ్ల కొనుగోలు బీజేపీ వైఖరి…ఢిల్లీ వేదికగా నిప్పులు చెరిగిన తెలంగాణ మంత్రి నిరంజ‌న్ రెడ్డి!

Drukpadam

కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి…

Drukpadam

షర్మిల పార్టీకి ఇందిరా శోభన్ గుడ్ బై …ఇదే బాటలో మరికొందరు !

Drukpadam

Leave a Comment