Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

పాకిస్థాన్ గగనతలంలో తక్కువ ఎత్తులో ప్రయాణించవద్దు… విమానయాన సంస్థలకు యూరోపియన్ ఏజెన్సీ హెచ్చరిక

పాక్ గగనతలంలో విమానాలు తక్కువ ఎత్తులో ప్రయాణించవద్దు …

  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామంటున్న పాక్
  • పాక్ ను నమ్మని పాశ్చాత్య దేశాలు!
  • పాక్ గగనతలం ప్రమాదకరమన్న ఈఏఎస్ఏ
  • ఈఏఎస్ఏ ప్రకటనను కొట్టిపారేసిన పాక్ వర్గాలు

ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ పాకిస్థాన్ పై పాశ్చాత్య దేశాలకు అనుమానాలు తొలగిపోవడంలేదు. తాజాగా, ఈఏఎస్ఏ (యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ) చేసిన హెచ్చరికే అందుకు నిదర్శనం. 

పాక్ గగనతలంలో ప్రయాణించేటప్పుడు తక్కువ ఎత్తులో వెళ్లవద్దని ఈఏఎస్ఏ విమానయాన సంస్థలను అప్రమత్తం చేసింది. పాక్ గగనతలంలో 260 అడుగుల కంటే తక్కువ ఎత్తులో పయనించడం అంటే ప్రమాదాన్ని ఆహ్వానించడమేనని పేర్కొంది.

పాక్ లో పలు ముష్కర మూకలు ఉన్నాయని, వారి వద్ద పోర్టబుల్ విమాన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయని వెల్లడించింది. ముఖ్యంగా, వారి వద్ద తక్కువ ఎత్తులో వెళ్లే విమానాలను కూల్చగల శక్తిమంతమైన ఆయుధాలు (మొబైల్ రాకెట్ లాంచర్లు, మ్యాన్ ప్యాడ్స్) ఉన్నాయని ఈఏఎస్ఏ స్పష్టం చేసింది. ఈ ప్రకటన వచ్చే ఏడాది జనవరి 31 వరకు వర్తిస్తుందని పేర్కొంది. 

అయితే, ఈఏఎస్ఏ ప్రకటను పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, పాకిస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆపరేటర్ల సంఘం (ఏఓఓఏ) తప్పుబట్టాయి. పాకిస్థాన్ గగనతలం ప్రమాదకరమైనదని పేర్కొనడం అర్థరహితమని, ఈఏఎస్ఏ ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని ఏఓఓఏ డిమాండ్ చేసింది. 

పాక్ గగనతలం అన్ని రకాల విమానయాన కార్యకలాపాలకు సురక్షితం అని పాక్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొంది.

Related posts

బ్రిటన్ ఎన్నికల్లో గెలిచిన భారత సంతతి నేతలు వీరే!

Ram Narayana

భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఢీ కొట్టే చాన్స్ 72 శాతం

Ram Narayana

నేను నిర్దోషిని.. అమెరికాకు ఇది దుర్దినం: కోర్టు వాంగ్మూలంలో డొనాల్డ్ ట్రంప్

Ram Narayana

Leave a Comment