సెహబాష్ కలెక్టర్ గౌతమ్ గారు … పిల్లల చదువుల పట్ల చూపుతున్న శ్రద్ధకు హాట్ షాప్…
స్థానిక ఇందిరా నగర్ పాఠశాల సందర్శించి మౌలిక వసతులు పరిశీలించిన కలెక్టర్ ..
పిల్లతో కలిసి భోజనం చేసిన ..వారితో మాట మంతి..
ఎన్ ఎస్ పి పాఠశాల సందర్శించి పిల్లలకు పాఠాలు చెప్పిన అదనపు కలెక్టర్ ..
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2023/08/pillato-mata-manti-collector-.jpg?resize=1024%2C667&ssl=1)
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2023/08/pillalato-collector.jpg?resize=1024%2C667&ssl=1)
పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్ స్థానిక ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సందర్శించి, పిల్లలతో మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా వారితో మమేకమై పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 460 మంది పిల్లలున్నట్లు, ఉన్న టాయిలెట్ బ్లాకును బాలికల కొరకు వినియోగిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయురాలు శైలజ తెలిపారు. స్పందించిన కలెక్టర్ టాయిలెట్ బ్లాకు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలు, యూనిఫాం అందినది లేనిది, ఆంగ్ల బోధన విషయమై అడిగి తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యం పెట్టుకొని, లక్ష్యం దిశగా పట్టుదలతో శ్రమించాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ ఉద్భోదించారు.
పాఠశాల పిల్లలకు పాఠాలు చెప్పిన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ …
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2023/08/pillalaku-pathalu-cheputunna-madhusudan-nayak.jpg?resize=1024%2C460&ssl=1)
ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ ఎన్.ఎస్.పి. కాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పిల్లల సంఖ్య, హాజరు గురించి ఆడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందినది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయునిలా పిల్లలకు క్లాస్ తీసుకున్నారు. చదువు ఎంతో ముఖ్యమని, చదువుతో సమాజంలో గౌరవించబడతారని ఆయన అన్నారు. నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని, దృఢ సంకల్పంతో రాణించాలన్నారు. మన ముందు ఉన్నత లక్ష్యం ఏర్పరచుకొని, లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని పిల్లలకు ఉద్భోదించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. మాలతి, సిఎంఓ రాజశేఖర్, ఎస్ఎంసి చైర్మన్ నారాయణ రావు, అధికారులు, తదితరులు ఉన్నారు.