Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు.. బీజేపీ కూడా పోరాడింది: రాజ్‌నాథ్ సింగ్

  • తెలంగాణ రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి వీరులను గన్నదన్న రాజ్‌నాథ్
  • 1984లో బీజేపీ గెలిచిన రెండు ఎంపీ స్థానాల్లో ఒకటి తెలంగాణ నుంచేనని వెల్లడి
  • బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ రోల్ మోడల్‌గా నిలిచిందన్న రాజ్‌నాథ్
  • పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో చెప్పాలని నిలదీత

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఒక్కరే ఉద్యమించలేదని, యావత్ తెలంగాణ సమాజం, బీజేపీ కూడా పోరాటం చేసిందని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సోమవారం జమ్మికుంటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాణి రుద్రమదేవి, కుమురం భీమ్ వంటి ఎంతోమంది వీరులను కన్న గడ్డ తెలంగాణ అన్నారు. 

1984లో బీజేపీ రెండు ఎంపీ స్థానాలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని, ఆ సమయంలో గెలిచిన రెండింట ఒకటి తెలంగాణ నుంచి జంగారెడ్డి గెలిచారన్నారు.

గుజరాత్‌లో రెండున్నర దశాబ్దాలకు పైగా బీజేపీ అధికారంలో ఉందని, అందుకే ఆ రాష్ట్రం అభివృద్ధికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకు పోతోందన్నారు. కానీ పదేళ్లుగా తెలంగాణ ఎందుకు అభివృద్ధి చెందలేదో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమైందని, ఇదో ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలా తయారయిందని ఆరోపించారు…

నేను అలా చేయడం కేసీఆర్‌కు నచ్చలేదు!: హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్

Etala Rajender election campaign in Huzurabad


తెలంగాణకు అనుకూలంగా 2007లోనే బీజేపీ తీర్మానం చేసిందని, 2014లో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన ఘనత తమ పార్టీదేనని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆ సమయంలో రాజ్ నాథ్ సింగ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారన్నారు. సోమవారం జమ్మికుంటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశాభివృద్ధికి చిన్న రాష్ట్రాల ఏర్పాటు సరైనదని తీర్మానం చేసింది జనసంఘ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్‌లు కోరినట్లు చెప్పారు.

నాడు కమలాపురం ఓటర్లు ఏ రాజకీయ నేపథ్యం లేని తనను 25వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని గుర్తు చేసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు. తాను మంత్రినయ్యాక హాస్టల్‌కు సన్నబియ్యం ఇచ్చినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆసుపత్రుల్లో వసతులు పెంచానన్నారు. గత ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ అనేక కుట్రలు చేశారన్నారు. కానీ ప్రజల గుండెల్లో స్థానం ఉన్న తనలాంటి వ్యక్తిని ఓడించగలరా? అన్నారు. బీఆర్ఎస్ అప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టినా తానే గెలిచానన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏ పథకం కావాలన్నా బీఆర్ఎస్‌లోకి రమ్మని చెబుతున్నారని విమర్శించారు.

కరోనా సమయంలో భుజం తట్టాను..

తాను మందు ఇచ్చేస్థాయిలో లేకపోవచ్చు… సూదిచ్చేస్థాయిలో లేకపోవచ్చు… కానీ ధైర్యాన్ని ఇచ్చే స్థాయిలో ఉన్నానని కరోనా సమయంలో చెప్పానని, అన్నట్లుగానే గాంధీ ఆసుపత్రికి వెళ్లి మొట్టమొదటి కరోనా పేషెంట్ భుజం తట్టి ధైర్యం చెప్పానని గుర్తు చేశారు. కరోనా సమయంలో గ్రామాలకు గ్రామాలు ఏ ఊరికి ఆ ఊరివాళ్లు, ఏ ఇంటి వాళ్లు ఆ ఇంటికి కంప వేసుకున్నారని, అలాంటి సమయంలో గాంధీ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రికి తిరిగిన వ్యక్తిని తానే అన్నారు.

2015లో మున్సిపల్ కార్మికులు వేతనాలు పెంచమని సమ్మె చేస్తే నాడు కేసీఆర్ 1700 మంది కార్మికులను డిస్మిస్ చేసినట్లు చెప్పారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? అని ఆ రోజే తాను కేసీఆర్‌ను అడిగానని, వాళ్లు నోరులేని కార్మికులు అని, వాళ్లను డిస్మిస్ చేయవద్దని అడిగిన వ్యక్తిని తానే అన్నారు.

తెలంగాణ ఉద్యంలో ఎక్కడ టెంట్ వేస్తే అక్కడ గొంతు ఎత్తిన బిడ్డ ఈ ఈటల అన్నారు. ఏ ఉద్యమం ద్వారా తెలంగాణలో చైతన్యం వచ్చిందో ఆ అడ్డా ఇందిరా పార్క్, ఇది ఉద్యమాల గడ్డ అని, అలాంటి ప్రాంతాన్ని కేసీఆర్ నిషేధించారన్నారు. తెలంగాణ ఆకలిని అయినా భరిస్తుంది కానీ, ఆత్మగౌరవాన్ని కోల్పోదని నాడే కేసీఆర్‌కు చెప్పానన్నారు. ఆర్టీసీ కార్మికులకు ధైర్యం ఇచ్చిన వ్యక్తిని తాను అన్నారు. వీఆర్ఏలకు తాను మద్దతివ్వడం కేసీఆర్‌కు నచ్చలేదన్నారు. మంత్రి పదవి కంటే ప్రజల కోసం పని చేసిన వ్యక్తిని అన్నారు. ఇలా ప్రతి దానిని తాను అడ్డుకున్నానని, అందుకే తాను ఏకుమేకవుతున్నానని కేసీఆర్ భావించి తనను బలి చేశాడన్నారు..

Related posts

బీజేపీలో చేరిన మునుగోడు నేత చలమల కృష్ణారెడ్డి

Ram Narayana

పదవీ కాలం ముగిసే వరకు మాత్రమే బీఆర్ఎస్‌లో ఉంటాను: ఎమ్మెల్యే రేఖానాయక్

Ram Narayana

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్ట్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత

Ram Narayana

Leave a Comment