నా కళ్ల ముందే కాంగ్రెస్ గెలుపు… నా మెజారిటీ కనబడుతుంది
- పాలేరులో నాకు… రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి అధికారం ఖాయం
- మీ దగ్గర దోచుకున్న డబ్బే మీకు పంచేందుకు కందాల సిద్ధమయ్యాడు
- అవి మీవే… తీసుకొని హస్తానికి ఓట్లు వేయండి
- కూసుమంచి మండలం ఎన్నికల ప్రచారంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి

నా కళ్ల ముందే తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు… నా మెజారిటీ కనబడుతుంది. ప్రజల ఆశీస్సులు, దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. కూసుమంచి మండలంలోని మునిగేపల్లి, అగ్రహరం, నేలపట్ల, వెంకటాపురం, కోక్యాతండా, లోక్యా తండా, తురకగూడెం, కిష్టాపురం తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన పొంగులేటికి ప్రతి గ్రామంలోనూ డప్పు చప్పుళ్లు, కోలాటం నృత్యాలతో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమవుతూ వస్తుందని విమర్శించారు. ప్రజల ఆశీస్సులు, దీవెనలతో పాలేరులో తాను… రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టబోతుందన్నారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చాక సోనియమ్మ ప్రకటించిన ఆరు హామీలను అమలు చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలనగానే బీఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బు సంచులతో బయలుదేరారని విమర్శించారు. అదే కోవలో కందాల కూడా డబ్బులతో పాలేరు వాసులను మభ్యపెట్టేందుకు సిద్దమయ్యాడని విమర్శించారు. అవి మీవే… వాటిని తీసుకొని హస్తానికి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కేసీఆర్… పాలేరులో కందాల చెంప చెల్లుమనిపించేలా తీర్పుండాలన్నారు. దళితులను, బీసీలను, గిరిజనులతో పాటు అన్ని వర్గాల వారిని మభ్యపెట్టిన హీనుడు కేసీఆర్ అని విమర్శించారు. మహిళలకు, వృద్ధులకు, నిరుద్యోగులకు, వికలాంగులకు, రైతులతో పాటు అన్ని వర్గాల వారికి న్యాయం ఇందిరమ్మ రాజ్యంలో తప్పకుండా జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవిలో ఉన్నవారు, మరికొంతమంది నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రాయల నాగేశ్వరరావు, రాంరెడ్డి చరణ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
