- ఇప్పటివరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, యూపీ ఇన్చార్జిగా ఉన్న ప్రియాంక
- తాజాగా కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు
- యూపీ నూతన ఇన్చార్జిగా సీనియర్ నేత అవినాశ్ పాండే నియామకం
![AICC relieves Priyanka Gandhi from Uttar Pradesh Incharge responsibilities](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2023/12/image-22.jpeg?resize=1194%2C796&ssl=1)
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగానూ కొనసాగారు. తాజాగా, కీలక నియామకాలు చేపట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం ప్రియాంక గాంధీని యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. ఆమె స్థానంలో అవినాశ్ పాండేని యూపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా నియమిస్తూ హైకమాండ్ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.
అవినాశ్ పాండే మహారాష్ట్రకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత. వృత్తి రీత్యా ఆయన న్యాయవాది. కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం నేతగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. 2010లో ఆయన రాజ్యసభకు కూడా వెళ్లారు.
ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జిగా మాణికం ఠాగూర్ నియామకం
- త్వరలో సార్వత్రిక ఎన్నికలు
- పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్చార్జిలను నియమించిన కాంగ్రెస్
- ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్
![AICC appointed Makickam Tagore as AP Congress Incharge](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2023/12/image-23.jpeg?resize=1279%2C853&ssl=1)
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్చార్జిలను నియమించింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణికం ఠాగూర్ ను నియమించింది. మాణికం ఠాగూర్ కు అండమాన్ అండ్ నికోబార్ దీవుల కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించింది.
ఇక దీపా దాస్ మున్షీని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్ రావ్ ఠాక్రే వ్యవహరించారు.
అటు, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జిగా రణదీప్ సింగ్, తమిళనాడు-పుదుచ్చేరి-ఒడిశా ఇన్చార్జిగా డాక్టర్ అజయ్ కుమార్ లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2023/12/image-24.jpeg?resize=916%2C1280&ssl=1)