- ఎన్టీఆర్ 101వ జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ఎంపీ నామ నాగేశ్వరరావు
- బసవతారకం హాస్పిటల్ లో నందమూరి బాలకృష్ణ కలిసి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న నామ నాగేశ్వరరావు
- వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన బసవతారకం హాస్పిటల్ : నామ నాగేశ్వరరావు

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన నాయకుడు, విశ్వవిఖ్యాత, నటసార్వబౌమ, నటరత్న, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పద్మశ్రీ నందమూరి తారక రామారావు 101 వ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో జరిగిన వేడుకల్లో హాస్పిటల్ ట్రస్ట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణతో కలిసి ట్రస్ట్ మెంబర్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లోని చిన్న పిల్లల వార్డుల్లో పండ్లు పంచి పెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల వారికి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇవ్వడం తో పాటు జనతా వస్త్రాలు, పక్కా గృహాలు నిర్మించి పేదలకు ఇచ్చారని గుర్తు చేశారు. ఆ రోజు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు బసవతారకం హాస్పిటల్ స్థాపించి వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నందమూరి బాలకృష్ణ గారు కొనసాగిస్తూ ఆపదలో ఉన్న వారికి నేను ఉన్నాను అంటూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఆయన స్ఫూర్తి తోనే రాజకీయాల్లోకి వచ్చిన తాను పార్లమెంట్ లో 15వ లోక్ సభ లో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ గారి విగ్రహo ఏర్పాటు తన నేతృత్వంలోనే జరగడం తనకు గర్వకారణంగా ఉందని అన్నారు.
కార్యక్రమం లో జె ఎస్ ఆర్ ప్రసాద్, సీఈఓ డా. కే కృష్ణయ్య, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి. సుబ్రమణేశ్వరరావు, సునీల్ టాండన్, డాక్టర్ ఫణి కోటేశ్వరరావు, డాక్టర్ కల్పనా రఘునాథ్, సహ మెడికల్, నాన్ మెడికల్ సిబ్బంది, హెచ్ ఓడి లు పాల్గొన్నారు.