Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

తప్పు చేసినవారిని వదిలిపెట్టబోను.. చంద్రబాబు వార్నింగ్..

  • తప్పు చేసినవాడిని క్షమించి వదిలిపెడితే అది అలవాటుగా మారుతుందన్న చంద్రబాబు  
  • తప్పు చేసినవాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య 
  • విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు

తప్పు చేసినవారిని వదిలిపెట్టబోనని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. “తప్పు చేసినవాడిని క్షమించి, పూర్తిగా వదిలిపెడితే అది అలవాటుగా మారుతుంది. తప్పు చేసినవాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి. పదవి వచ్చిందని విర్రవీగొద్దు. వినయంగా ఉండాలి” అని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా తాను బుధవారం నాలుగోసారి ప్రమాణం చేయబోతున్నానని.. రేపటి ప్రమాణానికి ఉన్న ప్రాధాన్యత వేరని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మనపై బాధ్యత పెరిగిందన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు పవన్‌ కల్యాణ్ వచ్చి పరామర్శించడమే కాకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారని బాబు గుర్తు చేశారు. జనసేన, బీజేపీతో పొత్తు కలిసొచ్చిందన్నారు. 

ఇక పవన్‌, తాను కలిసి జిల్లా పర్యటన చేశామన్నారు. అటు బీజేపీ అగ్రనేతలు కూడా రాష్ట్రంలో పర్యటించారని, విజయవాడలో కూటమి రోడ్ షోను మోదీ అభినందించారని గుర్తుచేశారు. తాను ఎప్పుడూ రాగద్వేషాలకు అతీతంగా పనిచేశానని పేర్కొన్నారు. తనకు ప్రజాహితమే తెలుసన్నారు.

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇకపై మూడు రాజధానులు అంటూ ఆటలాడే పరిస్థితి రాష్ట్రంలో ఉండదని తేల్చి చెప్పారు. విశాఖపట్నంను ఆర్థిక, ఆధునిక రాజధానిగా అభివృద్ధి చేసుకుందామంటూ పిలుపునిచ్చారు.

గత పాలనలోనే పోలవరం దాదాపుగా పూర్తి..
సమష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం ఎంతో అవసరమని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని వివరించారు. నిజానికి 2014లో అధికారంలోకి వచ్చి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించినపుడే పోలవరం ప్రాజెక్టు పనులను 72 శాతం పూర్తిచేశామని చంద్రబాబు చెప్పారు. వరదలకు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెబుతూ.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నదులను అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికీ నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం శిథిలమైంది..
గత ప్రభుత్వ హయంలో ఐదేళ్లలోనే రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని, రైతులు అప్పుల పాలయ్యారని చెప్పారు. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను చక్కదిద్దే పని ప్రారంభిస్తామని వివరించారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళతామని చెప్పారు. ‘సీఎం పదవి హోదా కోసమే తప్ప పెత్తనం కోసం కాదు. సీఎం కూడా మామూలు మనిషే.. అలాగే మీ ముందుకు వస్తా. మిత్రుడు పవన్ కల్యాణ్ తో పాటు మేమంతా సామాన్యులుగానే ప్రజల వద్దకు వస్తాం’ అని చెప్పారు.

ప్రతి అడుగూ ప్రజాహితమే..
సీఎం పర్యటనల సందర్భంగా షాపులు, రోడ్లు మూసివేయడం, పరదాలు కట్టడం లాంటివి ఇకపై రాష్ట్రంలో కనిపించబోవని చెప్పారు. సిగ్నల్స్ దగ్గర వాహనాలను ఆపేయడం జరగదన్నారు. ‘ఐదు నిమిషాలు నాకు లేటైనా పర్వాలేదు కానీ ప్రజలకు అసౌకర్యం కలగవద్దు’ అని అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికీ భంగం కలగదని, ప్రతీ నిర్ణయం, ప్రతీ అడుగు ప్రజాహితం కోసమే ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారు: చంద్రబాబు

ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి పక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ఈ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని అన్నారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారన్నారు. ప్రజల మనోభావాల మేరకు కార్యకర్తలు పనిచేశారని కితాబునిచ్చారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయన్నారు.

ఇక పవన్‌ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేనన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి పరామర్శించడంతో పాటు టీడీపీ, జనసేన పొత్తును ఖరారు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలసి పనిచేశామన్నారు. దాంతో ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారని చంద్రబాబు గుర్తుచేశారు. ప్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగిందన్నారు. జనసేన పోటీచేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందడం విశేషం అన్నారు. అటు బీజేపీ పోటీచేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుపొంది సత్తాచాటిందన్నారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Related posts

అది చంద్రబాబు విచక్షణకే వదిలేస్తున్నా: వైఎస్ భారతి

Ram Narayana

ఏపీలో కూటమి ఏర్పడ్డాక ఈసీ వైఖరి మారింది: సజ్జల ఫైర్

Ram Narayana

 ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారు

Ram Narayana

Leave a Comment