Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ కాన్వాయ్ ని మధ్యలోనే ఆపేసిన పోలీసులు..అయినా ఆగని పరామర్శ..

Jagan Convoy Stopped By AP Police
  • వినుకొండకు బయలుదేరిన జగన్ ను మధ్యలోనే ఆపేసిన వైనం
  • రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం యత్నం
  • 144 సెక్షన్ కారణంగా ర్యాలీలకు అనుమతి లేదని వివరణ
  • చివరకు ఒంటరిగా మరో కారులో వినుకొండ చేరుకున్న జగన్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నాయకులతో కలిసి భారీ వాహనశ్రేణితో వినుకొండ వెళుతున్న జగన్ ను మధ్యలోనే ఆపేశారు. వినుకొండలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలవుతోందని, ర్యాలీలు ప్రదర్శనలకు అనుమతి లేదని వివరించారు. దీంతో జగన్ తన కాన్వాయ్ ని వదిలి మరో కారులో వినుకొండ వెళ్లారు. ఆయనతో పాటు వినుకొండకు బయలుదేరిన వైసీపీ నాయకుల వాహనాలను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు సహా పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు.

రషీద్ కుటుంబానికి పరామర్శ
బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై హత్యకు గురైన వైసీపీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ వినుకొండకు బయలుదేరారు. వర్షం కారణంగా రోడ్డు మార్గం ద్వారా బయలుదేరడంతో ఆయన వెంట వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా ఇతర నాయకులు పదుల సంఖ్యలో కాన్వాయ్ తో బయలుదేరారు. పోలీసులు అడ్డుకోవడంతో జగన్ ఒక్కరే పోలీస్ సెక్యూరిటీ నడుమ వినుకొండ చేరుకున్నారు. అక్కడ రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. దీనిపై గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్ వచ్చి పరామర్శించవచ్చనీ, కానీ జనసమీకరణకు, ప్రదర్శనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని పేర్కొన్నారు.

 వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్

Jagan visits Rasheed family members in Vinukonda
  • వినుకొండలో రషీద్ అనే యువకుడి దారుణ హత్య
  • నేడు వినుకొండలో రషీద్ ఇంటికి వెళ్లిన జగన్
  • హత్య వెనుక ఎవరున్నా వదిలేది లేదని స్పష్టీకరణ

పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ నేడు వినుకొండలో రషీద్ ఇంటికి వెళ్లారు. తీవ్ర విషాదంలో ఉన్న రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హత్య ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. రషీద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

హత్య చేసేటంత ఫ్యాక్షన్ కక్షలు కూడా లేవని, మరి ఈ ఘటన ఎలా జరిగింది? అని రషీద్ కుటుంబ సభ్యులను ఆరా తీశారు. మీరన్నా, వైసీపీ అన్నా రషీద్ కు ఎంతో అభిమానం అని తల్లిదండ్రులు జగన్ కు వివరించారు. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నా వదిలేది లేదని, రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. 

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి దారుణాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారని, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కాగా, జగన్ రాకతో వినుకొండలో రషీద్ ఇంటి వద్ద భారీగా కోలాహలం నెలకొంది.

వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం వైసీపీ అధినేత జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అటవిక పాలన కొనసాగుతోందని అన్నారు. గత 45 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఏ సామాన్యుడ్ని అడిగినా ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనే చెబుతున్నారని పేర్కొన్నారు. 

టీడీపీ వాళ్లయితే చాలు… వారు ఎవరినైనా కొట్టొచ్చు, ఎవరి ఆస్తులైనా ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరిపైనైనా హత్యాయత్నం చేయొచ్చు, వారు ఏం చేసినా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తారు, బాధితులపైనే కేసులు పెడతారు అనే నీచ సంస్కృతి ఇవాళ రాష్ట్రంలో రాజ్యమేలుతోందని జగన్ వ్యాఖ్యానించారు. 

“చంద్రబాబు నాయుడి గారిని ఒకే ఒక్కటి అడుగుతున్నా. ఈ 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయి. టీడీపీ వాళ్ల వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. 

ఇళ్లలో చొరబడుతున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, షాపులు కాల్చివేస్తున్నారు, వైసీపీ సానుభూతిపరుల చీనీ తోటలు నాశనం చేస్తున్నారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఇవికాకుండా… 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇదీ. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని చెప్పడానికి వినుకొండలో రషీద్ హత్య ఘటనే ఉదాహరణ. ఇంతకుముందు ఇక్కడ రవిశంకర్ రెడ్డి అని మంచి ఎస్పీ ఉండేవాడు. కానీ ఎన్నికల వేళ వీళ్లకున్న పలుకుబడితో ఆయనను తప్పించేశారు. ఆ తర్వాత వీళ్లకు కావాల్సిన బిందు మాధవ్ అనే అధికారిని తెచ్చుకున్నారు. ఈ బిందు మాధవ్ ఎంతటి అన్యాయస్తుడు అంటే, ఎన్నికల సంఘమే స్వయంగా జోక్యం చేసుకుని అతడ్ని తప్పించాల్సి వచ్చింది. 

ఆ తర్వాత ఎన్నికల సంఘమే మలికా గార్గ్ అనే మంచి ఆఫీసర్ ను తీసుకువచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ ను కూడా పంపించివేశాడు. ఆ తర్వాత వీళ్లకు కావాల్సిన శ్రీనివాస్ అనే ఎస్పీని తెచ్చుకున్నారు. ఆ ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఈ హత్య జరిగింది. 

అత్యంత దారుణంగా, నడిరోడ్డుపై, అమాయకుడైన వ్యక్తిని అతి కిరాతకంగా నరికి చంపడం ప్రజలందరూ చూశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సానుభూతిపరులను ఇలాగే చంపుతామని సందేశం పంపినట్టుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కూడా పత్రికల ముసుగులో దిగజారిపోయాయి. హత్య చేసిన జిలానీ బైక్ ను గతంలో వైసీపీ వాళ్లు కాల్చేశారట… అందుకే ఈ హత్య జరిగిందని ఈనాడులో దిక్కుమాలిన అబద్ధం రాశారు. నిజంగా ఇవి పేపర్లా, టీవీ చానళ్లేనా? సిగ్గుతో తలదించుకోవాలి. 

వాస్తవానికి ఆ బైక్ ఆసిఫ్ అనే వైసీపీ మద్దతుదారుడింది. అప్పట్లో తన బైక్ తగలబెట్టారంటూ ఆసిఫ్ టీడీపీ నేతలపై కేసు పెట్టాడు. జరిగిన ఇన్సిడెంట్ ఇదీ. అది కూడా ఈ ఏడాది జనవరి 17న ఆ ఘటన జరిగింది. వ్యక్తిగత కారణాలతోనే హత్య జరిగిందని పోలీసులు కూడా సహకారం అందిస్తున్నారు” అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రజలకు పథకాలు అమలు చేయని చంద్రబాబు, వీటన్నింటి నుంచి దృష్టి  మరల్చేందుకు ప్రజల్లో భయాందోళనలు సృష్టించే కార్యక్రమాలకు తెరలేపారని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. చంద్రబాబు ఈ మాదిరిగా దాడులు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, దిగజారిన రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. 

“కచ్చితంగా వీటిపై నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే సమయంలో తప్పకుండా అడ్డుతగులుతాం. రాష్ట్రంలో శాంతిభద్రతలపై గవర్నర్ ను నిలదీస్తూ, వైసీపీ గళం విప్పుతుంది. 

ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఢిల్లీ వెళ్లి బుధవారం (జులై 24) నాడు సింబాలిక్ ప్రొటెస్ట్ చేపడతారు. ఏపీలో జరుగుతున్న దాడులు, శాంతిభద్రతల పరిస్థితుల గురించి దేశమంతా తెలిసేలా ఈ నిరసన కార్యక్రమం ఉంటుంది. 

అందులో భాగంగానే, ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ అడిగాం. అమిత్ షా, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కూడా తీసుకుంటాం. వీళ్లందరినీ కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై వివరిస్తాం. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళతాం” అని జగన్ స్పష్టం చేశారు.

Related posts

వైఎస్సార్ బిడ్డనైన నేను వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా పోతానా?: వైసీపీ శ్రేణులపై షర్మిల ఫైర్

Ram Narayana

ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్.. ఒకేసారి చంద్రబాబు, జగన్ ప్రచారం ప్రారంభం

Ram Narayana

జనసేనకు 25 సీట్లు ఇస్తారట… అందులో సగం స్థానాల్లో టీడీపీ నేతలే పోటీ చేస్తారట!: పేర్ని నాని వ్యంగ్యం

Ram Narayana

Leave a Comment