Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ ఆర్థిక పరిస్థితి, పథకాలపై హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు…

  • ప్రజాపాలనలో కంచెలు ఉండవని చెప్పిన రేవంత్ అసెంబ్లీ చుట్టూ నాలుగు వేయించారని విమర్శ
  • కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్రం అనుబంధ గ్రాంట్స్ విడుదల చేయడం లేదన్న హరీశ్
  • తెలంగాణలో పథకాలు నిలిచిపోయే పరిస్థితులు ఉన్నాయని ఆగ్రహం

ప్రజాపాలనలో కంచెలు ఉండవని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి మాత్రం నాలుగు కంచెలు వేయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ అనుబంధ గ్రాంట్స్ విడుదల చేయకపోవడంతో తెలంగాణలో పథకాలు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమం విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా మొద్దు నిద్రపోతోందన్నారు. బీఆర్ఎస్ తట్టి లేపినా… కనీసం సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహించడం లేదని మండిపడ్డారు. ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రూ.750 కోట్ల గ్రాంట్ విడుదల కాలేదన్నారు. గ్రామపంచాయతీలకు మార్చికి ముందే రూ.500 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని పంచాయతీలకు అందించలేదన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు నెలలుగా వేతనాలు రావడం లేదని మండిపాటు

పారిశుద్ధ్య కార్మికులకు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. తాము ప్రశ్నించడంతో జీతాలు విడుదల చేస్తామని ప్రకటించారన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా జీతాల్లేవని, జీహెచ్ఎంసీ కార్పోరేటర్లకు అత్యవసర నిధిని ఆపేశారన్నారు. హోంగార్డులు వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా పోలీసుల వాహనాలకు ఇంధనం కోసం నిధులు ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు.

జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం ఇప్పటికే రూ.850 కోట్లను అందించిందని, కానీ రాష్ట్ర వాటా రూ.350 కోట్లు ఇప్పటి వరకు జమ చేయలేదని విమర్శించారు. కేంద్రం విడుదల చేసిన నిధులను అనుబంధ విభాగాలకు 15 రోజుల్లో ఇవ్వాలని లేకుంటే వాటికి రాష్ట్రం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. రెండు నెలలుగా ఆసరా పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు కూడా అటకెక్కాయన్నారు. 

విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉందన్న హరీశ్ రావు

తెలంగాణలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వినియోగం గతంలో కంటే పెరగనప్పటికీ కరెంట్ కోతలు ఎందుకో చెప్పాలన్నారు. కరెంట్ కోతలకు తొండలు, బల్లులు అంటూ విచిత్రమైన కారణాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పంచాయతీలు, స్కూల్స్ విద్యుత్ బిల్లులు చెల్లించలేకపోతున్నాయన్నారు. దీంతో విద్యుత్ శాఖ ఆదాయానికి గండి పడుతోందన్నారు.

రుణమాఫీపై కొర్రీలు

రుణమాఫీ చేస్తామని చెప్పి కొర్రీలు పెట్టారని మండిపడ్డారు. రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలను అమలు చేయడంతో పలువురు రైతులు అర్హత కోల్పోయారన్నారు. ఎంతోమంది రైతులకు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టారన్నారు. కొంతమందికి పూర్తిగా రుణమాఫీ కాలేదన్నారు. గత నిబంధనల ప్రకారం రుణమాఫీ చేశామని మంత్రులు చెబుతున్నారని… అలా చేస్తే ఎక్కువమంది రైతులకు మాఫీ కావాల్సి ఉందన్నారు. రైతు బీమా చెక్కులు కూడా సకాలంలో అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైద్యశాఖలో డాక్టర్లను ఇష్టారీతిన బదిలీ చేశారని విమర్శించారు. ఏమాత్రం వసతులులేని ఆసుపత్రులకు స్పెషాలిటీ డాక్టర్లను బదిలీ చేశారని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు బీహారీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు వారే ముద్దయ్యారా? అని నిలదీశారు. సివిల్ సర్వీసెస్ అధికారులకు కులం, ప్రాంతం ఆపాదించకూడదన్నారు. సిద్దిపేటలో అమలు చేసిన పలు కార్యక్రమాలకు కేంద్ర ఆర్థికసర్వేలో చోటు దక్కడం సంతోషంగా ఉందన్నారు.

Related posts

28వ తేదీ వరకు 54 సభలు… సీఎం కేసీఆర్ రెండో విడత ప్రచార షెడ్యూల్ ఇదే

Ram Narayana

తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

వ్రతం చెడ్డా ఫలితం దక్కని జలగం వెంకట్రావు …!

Ram Narayana

Leave a Comment