50 లక్షల 65 వేల కోట్లతో కేంద్రం భారీ వార్షిక బడ్జెట్
కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26: ఏ రంగానికి ఎంతెంత…!
పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
2025-26 వార్షిక బడ్జెట్ రూ.50,65,345 కోట్లు అని ప్రకటన
రక్షణ రంగానికి అత్యధికంగా రూ.4.91 లక్షల కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీయే కూటమి సభ్యుల హర్షధ్వనాల మధ్య పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో రికార్డు స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
ఈసారి రక్షణ రంగానికి రూ.4.91 లక్షల కోట్లతో అత్యధిక కేటాయింపులు చేశారు. మారుతున్న ప్రపంచ సమీకరణాలు, సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక వైఖరి అవలంబించడం, సరికొత్త ఆయుధాల అభివృద్ధి, సైన్యాన్ని పటిష్టం చేయడం వంటి కారణాల రీత్యా రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు.
కేటాయింపుల వివరాలు ఇవిగో…
రక్షణ రంగం- రూ.4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ధి- రూ.2,66,817 కోట్లు
హోంశాఖ- రూ.2,33,211 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలు- రూ.1,71,437 కోట్లు
విద్యా రంగం- రూ.1,28,650 కోట్లు
ఆరోగ్య రంగం- రూ.98,311 కోట్లు
పట్టణాభివృద్ధి- రూ.96,777 కోట్లు
ఐటీ, టెలికాం రంగం- రూ.95,298 కోట్లు
ఇంధన రంగం- రూ.81,174 కోట్లు
పారిశ్రామిక, వాణిజ్య రంగాలు- రూ.65,553 కోట్లు
సామాజిక సంక్షేమ రంగం- రూ.60,052 కోట్లు
శాస్త్ర సాంకేతిక రంగం- రూ.55,679 కోట్లు
ఈసారి రెవెన్యూ లోటు రూ.5.23 లక్షల కోట్లు కాగా, ద్రవ్య లోటు రూ.15.68 లక్షల కోట్లు. 2025-26లో మూలధన వ్యయం రూ.11.2 లక్షల కోట్లు కాగా… స్థూల పన్ను రాబడి రూ.42.7 లక్షల కోట్లు అని నిర్మల వివరించారు.
కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.10.82 లక్షల కోట్లు కాగా, జీఎస్టీ సెస్ వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు, ఎక్సైజ్ పన్ను వసూళ్లు రూ.3.17 లక్షల కోట్లు అని వెల్లడించారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో రూ.15.82 లక్షల కోట్ల రుణాలు తీసుకోనుంది.
గురజాడ కవితతో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన కేంద్ర మంత్రి
‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..’ అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు కనబరిచిందని మంత్రి పేర్కొన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ, త్వరిత, సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తిదాయకం, మార్గదర్శకమని వెల్లడించారు.
దేశంలో వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టిసారించినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో 7.7 కోట్ల రైతులకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ను దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఆదాయపు పన్నుపై బడ్జెట్ లో కీలక ప్రకటన.. పరిమితి పెంచిన కేంద్రం
బడ్జెట్ లో వేతన జీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. మధ్యతరగతి ప్రజలకు ఆదాయపు పన్ను పరిమితిని పెంచింది. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించింది. టీడీఎస్ పై వడ్డీ ఆదాయంపై ప్రస్తుతం ఉన్న రూ.50 వేల పరిమితిని రూ. లక్షకు పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించింది. అద్దె ద్వారా వృద్ధులు పొందే ఆదాయంపై ప్రస్తుతం ఉన్న రూ.2.4 లక్షల పరిమితిని రూ. 6 లక్షలకు పెంచింది.
రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపును వర్తింపజేస్తామని తెలిపారు. దీనికి స్టాండర్డ్ డిడక్షన్ కూడా కలుపుకుంటే మరో రూ.75 వేల వరకు పన్ను మినహాయింపు పెరగనుంది. మొత్తంగా రూ.12.75 లక్షల వార్షికాదాయం వరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభించనుంది.
కొత్త పన్ను శ్లాబులు..
రూ. 4 లక్షల వరకు – పన్ను లేదు
రూ.4 నుంచి 8 లక్షల వరకు – 5%
రూ.8 నుంచి 12 లక్షల వరకు – 10%
రూ.12 నుంచి 16 లక్షల వరకు – 15%
రూ.16 నుంచి 20 లక్షల వరకు – 20%
రూ.20 నుంచి 24 లక్షల వరకు – 25%
రూ.24 లక్షల పైన 30 శాతం
2025: బడ్జెట్-2025: ధరలు పెరిగేవి… ధరలు తగ్గేవి ఇవే…!
అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలు ప్రభావితం
దాంతో పలు వస్తువుల ధరలు పెరిగితే… మరికొన్నింటి ధరలు తగ్గే అవకాశం ఉంది ..
ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు… అలాగే ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులతో పలు వస్తువుల ధరలు ప్రభావితం కానున్నాయి. దాంతో పలు వస్తువుల ధరలు పెరుగుతాయి. మరికొన్నింటి ధరలు తగ్గుతాయి. వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ధరలు తగ్గేవి..
క్యాన్సర్, అరుదైన వ్యాధుల మందులు
ప్రాణాలను రక్షించే మందులు
ఫ్రోజెన్ చేపలు
ఎలక్ట్రిక్ వాహనాలు
చేపల పేస్ట్
తోలు వస్తువులు
క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు
12 కీలకమైన ఖనిజాలు
ఓపెన్ సెల్
భారతదేశంలో తయారైన దుస్తులు
మొబైల్ ఫోన్లు
వైద్య పరికరాలు
ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీలు
ధరలు పెరిగేవి..
ఫ్లాట్ ప్యానెల్ డిస్ ప్లే
సిగరెట్లు
బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీ మహిళలకు గుడ్న్యూస్
బడ్జెట్లో షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన మహిళలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం టర్మ్ లోన్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2కోట్ల వరకు రుణాలు అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ పథకం ద్వారా మొత్తం 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. తొలిసారి సొంత వ్యాపారాలను ప్రారంభించే, ఉన్న వ్యాపారాలను విస్తరించాలనుకునే మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. అలాగే ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు.