గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేటలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు? : 2004 నుంచి 2014 వరకు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు ఏ గ్రామంలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు దక్కలేదని, ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని గుర్తు చేశారు. పది సంవత్సరాలు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అంతకు ముందు ఎంపీగా గెలిపిస్తే ఏనాడూ పాలమూరు గురించి పార్లమెంట్లో ప్రస్తావించలేదని అన్నారు. తెలంగాణ సాధించుకున్న తరువాత కూడా ఈ జిల్లాకు న్యాయం జరగలేదని విమర్శించారు.
కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదు : గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారు కానీ, జిల్లాకు చేసిందేమీ లేదని రేవంత్ ఆరోపించారు. నెట్టెంపాడు, భీమ, సంగంబండం, కోయిల్సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టుల పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. పది సంవత్సరాల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదని తెలిపారు. వైఎస్సార్, జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదని విమర్శించారు.
ఓడితే ముక్కు నేలకు రాస్తా : తన మీద పగతో మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టును పక్కన పడేశారని సీఎం ఆరోపించారు. ప్రజా పాలన సరిగా లేదని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పదేళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, 12 ఏళ్ల నుంచి మోదీ ప్రధానిగా ఉన్నారని, 12 నెలలుగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందని అన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి చర్చకు వస్తే ముఖ్యమంత్రిగా నేను సిద్ధమని, గత పదేళ్ల పాలనపై చర్చిద్దామని, ఈ చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. పది సంవత్సరాల్లో ఏమీ చేయని వాళ్లు ఏడాదిలోనే కాంగ్రెస్ ఏమీ చేయలేదని అంటున్నారని, పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోసగాళ్ల మాటలు విని భూసేకరణను అడ్డుకోవద్దని సూచించారు. భూమి కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇచ్చి న్యాయం చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.