- అల్లా దయతో అందరికీ మంచి జరగాలన్న సీఎం చంద్రబాబు
- ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకున్న వైఎస్ జగన్
- క్రమశిక్షణ, శాంతి సహనం, దాన గుణంతో కఠోర ఉపవాస దీక్షలు సాగాలన్న నారా లోకేశ్
ఈ రోజు నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేశ్ తదితరులు ‘ఎక్స్’ వేదికగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలని, ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
రంజాన్ చాంద్ ముబారక్ అంటూ నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. నెలవంక కనిపించింది కావున పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైందన్నారు. నెలంతా ఉపవాసాలు, పవిత్ర ఖురాన్ పఠనం, తరావీ నమాజ్ భక్తి శ్రద్ధలతో చేపట్టే ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అల్లా దయతో క్రమశిక్షణ, శాంతి సహనం, దాన గుణంతో కఠోర ఉపవాస దీక్షలు సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని లోకేశ్ అన్నారు.
ఒక వర్గం కోసం టెన్త్ పరీక్షల టైమ్ టేబుల్ మార్చుతారా?: బండి సంజయ్

ఒక వర్గం కోసం పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ మారుస్తారా అంటూ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని ఈ నెల 6 నుంచి నిర్వహించే పదవ తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకూ నిర్వహించాలని తెలంగాణలో రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
రంజాన్ కోసం ఇష్టమొచ్చినట్లుగా పదో తరగతి పరీక్షల టైమ్ టేబుల్ మారుస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక వర్గం వారి కోసం మరో వర్గం వారిని ఇబ్బందికి గురి చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని అన్నారు. ఈ సమయంలో విద్యార్థులు, అధ్యాపకులు సహా ప్రతి ఒక్కరూ భోజనం చేస్తారని, అదే సమయానికి పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు.
రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తర్వాత విధులనుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని అన్నారు. పాఠశాలల వేళలు సైతం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయని తెలిపారు. అయినప్పటికీ మళ్లీ రంజాన్ పేరుతో వేళాపాళా లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో ఇదేనా సమానత్వమంటే అని ప్రశ్నించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులకు, అధ్యాపకులకు ఇబ్బంది లేకుండా పదవ తరగతి ప్రీఫైనల్ పరీక్షా టైంటేబుల్ను మార్చాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.