- గత నెలలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఘోర ప్రమాదం
- సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది సిబ్బంది
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- కేరళ డాగ్స్ రాకతో రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి
ఎస్ఎల్బీసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యల్లో నేడు పురోగతి కనిపించింది. టన్నెల్ కూలిపోయిన ప్రదేశం వద్ద మానవ అవశేషాలను గుర్తించారు. సొరంగంలో మరింత లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది. అయితే, టన్నెల్ లో ఇరుక్కుపోయిన బోరింగ్ మెషీన్ భాగాలు సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారాయి. దాంతో, గ్యాస్ కట్టర్లతో మెషీన్ భాగాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ కూలిన ఘటనలో చిక్కుకుపోయిన వారి మృతదేహాలను కేరళ నుంచి తెప్పించిన జాగిలాలు గుర్తించినట్టు తెలిసింది. సొరంగం కూలడంతో అందులో పేరుకుపోయిన మట్టిని జాగ్రత్తగా తొలగిస్తున్నారు. ఈ క్రమంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి కనిపించింది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలోని డీ-2 పాయింట్లో గల్లంతైన వారి ఆనవాళ్లను జాగిలాలు గుర్తించినట్టు తెలిసింది. వారిలో కొందరిని నేటి సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉంది.
ఐదేళ్ల సుదీర్ఘకాలం తర్వాత ఇటీవల ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 22న ఉదయం పనులు జరుగుతుండగా టన్నెల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ క్రమంలో టన్నెల్ బోరింగ్ యంత్రానికి ఇటువైపున ఉన్న 42 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడగా, అటువైపున చిక్కుకుపోయిన 8 మంది జాడ గల్లంతైంది. వారిని రక్షించేందుకు అప్పటి నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తుండటంతో లోపల చిక్కుకుపోయిన వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు.