తెలంగాణ ప్రభుత్వం బుల్డోజర్లతో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోందని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ), కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మాట్లాడే హక్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేస్తున్న విధ్వంసాలు, చెట్ల నరికి వేత నరేంద్ర మోదీకి కనిపించడం లేదా అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చిల్లిగవ్వ ఇవ్వని ప్రధానికి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదన్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్ర నేతలు చెప్పగానే ఏదో మాట్లాడటం సరికాదని, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రైతులకు రుణ మాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్ సిలిండర్, 60 వేల ఉద్యోగాలు, రైతు భరోసా ఇలా ఎన్నో అమలు చేస్తున్నామని తెలిపారు.

previous post