- ఈ విషయం మహిళలందరికీ తెలుసు
- టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఘరానా రౌడీయని, అందుకే ఢిల్లీకి వెళ్లి మద్యం వ్యాపారం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తన తండ్రి కేసీఆర్ మంచివాడని, కానీ తాను అలా కాదని, రౌడీనంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కవిత, బీఆర్ఎస్ నేతలు ఎన్నో సందర్భాలలో అహంకార ధోరణిని ప్రదర్శించారని అన్నారు. తాను రౌడీని అంటూ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలను చూశానని, కానీ ఆమె ఘరానా రౌడీ అనే విషయం ఈ రాష్ట్ర మహిళలందరికీ తెలుసన్నారు. ఆమె రౌడీ కాక పోతే లిక్కర్ దందా ఎలా చేస్తుందని ప్రశ్నించారు. అయినా మీ బీఆర్ఎస్ పార్టీలో రౌడీలకు తక్కువేమీ లేదన్నారు. 60 నుంచి 70 శాతం మంది రౌడీలు ఆ పార్టీలో ఉన్నారని పేర్కొన్నారు.