అంతర్జాతీయం

కాల్పుల విరమణ ఉల్లంఘనను ఖండించిన పాకిస్థాన్!

  • కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని భారత్ ఆరోపణ
  • బలగాలకు తీవ్రంగా స్పందించాలని ఆదేశాలు జారీ చేసామన్న భారత  విదేశాంగ కార్యదర్శి
  • ఉల్లంఘన ఆరోపణలను ఖండించిన పాక్ మంత్రి అత్తావుల్లా తరార్
  • ఇది మాకు విజయోత్సవ సమయం, ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉన్నారన్న పాక్ మంత్రి

సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ ఈ వార్తలను తోసిపుచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు  వెంబడి నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద కాల్పులు పునరావృతమైతే భారత సాయుధ బలగాలు తగిన రీతిలో ప్రతిస్పందిస్తాయని భారత్ హెచ్చరించిన నేపథ్యంలో, తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ స్పష్టం చేశారు.

“పాకిస్థాన్ ఎలాంటి కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడదు, అలాంటి ఆలోచన కూడా చేయదు. ఇది మాకు విజయోత్సవ సమయం, ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉన్నారు” అని తరార్ జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు డాన్ పత్రిక ఉటంకించింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత దానిని ఉల్లంఘించే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. “ఇలాంటి నిరాధార ఆరోపణలకు బదులుగా విచక్షణతో వ్యవహరించాలి. ప్రస్తుతానికి పాకిస్థాన్ వైపు నుంచి ఎలాంటి ఉల్లంఘన జరగలేదు” అని ఆయన తెలిపారు.

అంతకుముందు, భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ శనివారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ఉల్లంఘనలను పరిష్కరించడానికి పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకోవాలని, పరిస్థితిని ‘బాధ్యతాయుతంగా’ ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంబడి ఉల్లంఘనలు పునరావృతమైతే కఠినంగా వ్యవహరించాలని సాయుధ బలగాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.

“కొన్ని గంటలుగా, భారత, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) మధ్య ఈరోజు సాయంత్రం కుదిరిన అవగాహనకు పదేపదే విఘాతం కలుగుతోంది” అని మిస్రీ తెలిపారు. “ఇది ఈరోజు కుదిరిన అవగాహనను ఉల్లంఘించడమే. ఈ ఉల్లంఘనలకు సాయుధ బలగాలు తగిన రీతిలో, సరైన విధంగా ప్రతిస్పందిస్తున్నాయి. ఈ ఉల్లంఘనలను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము” అని ఆయన స్పష్టం చేశారు.

Related posts

అతడు జైల్లో ఉండాల్సిన వ్యక్తి: ట్రంప్

Ram Narayana

ప్రియురాలి కోసం కొలంబియా వెళ్లి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఏపీ యువకుడు

Ram Narayana

నా కుమారుడు అమెరికా ప్రెసిడెంట్ కావాలనేది నా కోరిక : కేఏ పాల్

Ram Narayana