కడప గడపలో తెలుగుదేశం మహానాడు ఘనంగా ప్రారంభం
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు
2024 లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడు
మహానాడును ప్రారంభించిన జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ప్రత్యేక ఆకర్షణగా నారా లోకేష్ …ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ ప్రచారం..
మాతెలుగు తల్లికి మల్లెపూల దండ సాంగ్ తో మహాసభ ప్రారంభం….
తెలుగుదేశం పార్టీ మహానాడు కడప గడపలో ఘనంగా ప్రారంభమైంది ….2024 లో తిరిగి ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మహానాడు నిర్వహిస్తుండటంతో రెట్టించిన ఉత్సహంతో ప్రతినిధులు మహానాడుకు హాజరైయ్యారు …దేశంలోని ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు అండమాన్ నుంచి కూడా ప్రతినిధులు హాజరు కావడం విశేషం…అండమాన్ టీడీపీ స్థానిక సంస్థల కార్పొరేషన్ గెలుచుకుంది …మహానాడును జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు ….సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు …ఆయనకు ఈసారి పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ పదవి కట్టబెడతారనే ప్రచారం జరుగుతుంది …మాతెలుగు తల్లికి మల్లెపూల దండ అనే సాంగ్ తో మహానాడు సమావేశాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైయ్యాయి …మహానాడులో ప్రతినిధులకు రకరకాల వంటకాలతో పసందైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు ….కడపను పసుపు నగరంగా పార్టీ తోరణాలు జెండాలు , ఫ్లెక్సీలతో అందంగా అలంకరించారు …
అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహానాడు… రిజిస్ట్రేషన్ చేయించుకున్న చంద్రబాబు
27-05-2025 Tue 11:21 | Andhra

- కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు
- రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
- 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు
తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహానాడు సందర్భంగా కడప పసుపుమయంగా మారింది. మహానాడు ప్రాంగణంలో పార్టీ అధినేత చంద్రబాబు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను వీక్షించారు. అనంతరం వేదికపైకి వచ్చారు. వేదికపై ఉన్న పార్టీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబుకు నమస్కరించారు. అనంతరం వేదికపై చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది. మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈరోజున మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం ఉంటుంది. పార్టీ సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై చర్చ జరుగుతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
టీడీపీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుంది: చంద్రబాబు
- ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కడపలో తొలి మహానాడు
- టీడీపీ శ్రేణులకు చంద్రబాబు శుభాకాంక్షలు
- ప్రజాసేవకు పునరంకితం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు
- యువగళం, అన్నదాత, స్త్రీ శక్తి, పేదల సేవకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన
- కార్యకర్తే అధినేతగా మారాలనేదే తన ఆకాంక్ష అన్న సీఎం
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మహానాడు పండుగ సందర్భంగా పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కడపలో జరుగుతున్న ఈ తొలి మహానాడు ఎంతో కీలకమైనదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజాసేవకు పునరంకితం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ ఖాతా ద్వారా తన సందేశాన్ని పంచుకున్నారు. “ఉత్తుంగ తరంగంలా ఎగసిపడే ఉత్సాహం టీడీపీ కార్యకర్తల సొంతం. ఉరకలేసే యువత తెలుగుదేశం ఆస్తి” అని కార్యకర్తల ఉత్సాహాన్ని, యువత ప్రాముఖ్యతను కొనియాడారు. తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయడం తెలుగుదేశం పార్టీ పవిత్ర కర్తవ్యమని నొక్కి చెప్పారు. “ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఆ దేశానికే తలమానికంగా మారాలనేది మన సంకల్పం. అందుకే మనం నిరంతరం శ్రమిస్తున్నాం” అని చంద్రబాబు తెలిపారు.
గతంలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న అనేక పరీక్షలను విజయవంతంగా అధిగమించిందని గుర్తుచేస్తూ “తెలుగుదేశం పరీక్షల్ని ఎదుర్కొన్న ప్రతిసారీ విజేతగానే నిలిచింది. గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విశ్వరూప సందర్శనం చరిత్రలో నిలిచిపోతుంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ మహానాడు సందర్భంగా కొన్ని ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి సారించాలని చంద్రబాబు ఆకాంక్షించారు. “ప్రజా సేవకు పునరంకితమవుతూ ‘యువగళం’కు ప్రాధాన్యమివ్వాలని, అన్నదాతకు అండగా నిలవాలని కోరుతున్నా. ‘స్త్రీ శక్తి’కి పెద్దపీట వేయాలని, ‘పేదల సేవలో’ నిరంతరం శ్రమించాలని, ‘తెలుగు జాతి విశ్వఖ్యాతి’ లక్ష్యాన్ని సాధించే దిశగా కార్యాచరణ ఉండాలని ఆకాంక్షిస్తున్నా” అని తన సందేశంలో వివరించారు.
పార్టీలో కార్యకర్తల పాత్రను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో “‘కార్యకర్తే అధినేత’గా మారాలనే నూతన మార్గదర్శకాలతో, ఇనుమడించిన ఉత్సాహంతో మనం ముందుకు సాగాలి. అదే నా ఆశ.. ఆకాంక్ష” అని చంద్రబాబు నాయుడు తన మనోగతాన్ని స్పష్టం చేశారు.