- టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక
- శాంతిభద్రతల పరిరక్షణే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం
- రాయలసీమ, ఉత్తరాంధ్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన, కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు రెండవ రోజున మరోసారి ఈ పదవికి ఎంపికయ్యారు. పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ వర్ల రామయ్య, చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టతనిచ్చారు.
కార్యకర్తలే పార్టీకి బలం, బలగం
ముందుగా, తనను ఏకగ్రీవంగా ఎన్నుకుని గురుతర బాధ్యతను అప్పగించిన పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. “తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలం, బలగం” అని ఆయన ఉద్ఘాటించారు. కడప మహానాడు విజయవంతం కావడం పట్ల, ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ మహానాడులో ఆరు తీర్మానాలు, అర్థవంతమైన చర్చల ద్వారా రాబోయే 40 ఏళ్లకు ప్రణాళికలు రచించుకున్నామని, ప్రపంచపటంలో తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మహానాడుకు ప్రకృతి కూడా సహకరించిందని పేర్కొన్నారు.
హైదరాబాద్ను అభివృద్ధి చేసి, సైబరాబాద్ను సృష్టించింది టీడీపీయేనని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ తనకు సమానమేనని చంద్రబాబు అన్నారు. 47 ఏళ్లుగా ఆదరించిన ఆంధ్రప్రదేశ్ రుణం తీర్చుకోవాలనే రాత్రింబవళ్లు శ్రమిస్తున్నానని, రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించి రైతుల రుణం తీర్చుకోవడమే తన లక్ష్యమని పునరుద్ఘాటించారు. అమరావతిని ప్రజారాజధానిగా నిర్మించేందుకు ప్రాజెక్టులను పట్టాలెక్కించామని, తన హైకమాండ్ అయిన కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులతో ఒక్కొక్కటిగా అన్నీ సాధిస్తామని చెబుతూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు.
శాంతిభద్రతల పరిరక్షణ – గంజాయిపై ఉక్కుపాదం
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు ప్రజల ఆస్తులకు రక్షణ కరువైందని, గంజాయి, డ్రగ్స్ వంటివి విచ్చలవిడిగా రాజ్యమేలాయని ఆరోపించారు. “వైసీపీ హయాంలో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఒక కుటీర పరిశ్రమగా మారింది. గత ప్రభుత్వ అధినేతే తన బాబాయ్ను హత్య చేయించి, ఆ నిందను నాపై మోపే ప్రయత్నం చేశారు,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని రూపుమాపిన ఘనత టీడీపీదేనని గుర్తుచేశారు.
“శాంతిభద్రతల విషయంలో ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా సరే, కఠినంగా శిక్షిస్తాం, చండశాసనుడిలా వ్యవహరిస్తా” అని హెచ్చరించారు.
రాయలసీమ సస్యశ్యామలం – జలవనరుల అభివృద్ధి
రాయలసీమను కరవు సీమగా, ఎడారి సీమగా మారనీయబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాటిని మరింత ముందుకు తీసుకెళ్లానని తెలిపారు. ఉద్యాన పంటలతో అనంతపురం జిల్లా నేడు ఆర్థికంగా ముందంజలో ఉండటానికి టీడీపీ ప్రభుత్వ కృషే కారణమన్నారు. ఈ ఏడాది రాయలసీమ నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి రూ.3,800 కోట్లు కేటాయించామని, పోలవరం తర్వాత అత్యధిక నిధులు ఖర్చు చేస్తున్న ప్రాజెక్టు హంద్రీనీవానే అని వివరించారు. వెలిగొండ ప్రాజెక్టును కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామన్నారు.
బీఆర్ఎస్ అనవసరంగా విమర్శలు చేస్తోంది: సీఎం చంద్రబాబు

- కడపలో టీడీపీ మహానాడు
- నేడు రెండోరోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవం
- చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించిన వర్ల రామయ్య
- పోలవరం గురించి మాట్లాడిన చంద్రబాబు
- తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తే తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని వెల్లడి
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజున ఈ ఎన్నిక జరిగింది. పార్టీ ఎన్నికల అధికారి వర్ల రామయ్య ఈ మేరకు ప్రకటన చేశారు. మహానాడు వేదికగా, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి, ప్రజ సంక్షేమమే తన ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. తన అంతిమ లక్ష్యం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపించడమేనని పునరుద్ఘాటించారు.
బహుళార్థసాధక పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని సద్వినియోగం చేసుకుంటే తెలంగాణకు కూడా ప్రయోజనం చేకూరుతుందని, దీనిపై బీఆర్ఎస్ అనవసర విమర్శలు చేస్తోందని అన్నారు. గోదావరిపై తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తే తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు.
పోలవరం నుంచి కృష్ణా నదికి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు, ఆపై బనకచర్లకు నీటిని తరలించే బృహత్తర ప్రణాళికను వివరించారు. “పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం ద్వారా తెలుగు నేలకు జలహారతి ఇచ్చి, ఈ ప్రాంత రుణం తీర్చుకుంటాం” అని చంద్రబాబు పేర్కొన్నారు.