అంతర్జాతీయం

పింఛన్ కోసం కొడుకు ఘరానా మోసం.. చనిపోయిన తల్లిలా వేషం!

Italian Man Impersonates Dead Mother To Keep Pension Flowing
  • మూడేళ్లుగా రూ.80 లక్షలు అక్రమంగా స్వాహా
  • తల్లి మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే మమ్మీగా భద్రపరిచిన వైనం
  • రిజిస్ట్రీ అధికారి అనుమానంతో బట్టబయలైన మోసం
  • నిందితుడిని అరెస్ట్ చేసిన ఇటలీ పోలీసులు

ఇటలీలో జరిగిన ఓ విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తల్లి పింఛను కోసం ఆమెలాగే వేషం వేసుకుని అధికారులను బురిడీ కొట్టించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మోసం ద్వారా అతడు మూడేళ్లుగా ఏకంగా రూ. 80 లక్షలు కాజేసినట్లు తేలింది. హారర్ సినిమాను తలపించే ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే.. ఇటలీలోని బోర్గో వర్జీలియో పట్టణానికి చెందిన 56 ఏళ్ల నిందితుడు మంటోవా గతంలో నర్సుగా పనిచేసేవాడు. మూడేళ్ల క్రితం అతని తల్లి డాల్ ఓగ్లియో మరణించింది. అయితే,  ఈ విషయాన్ని బయటకు తెలియనీయకుండా, ఆమె పింఛను ప్రతినెలా తీసుకుంటూ వచ్చాడు. ఇందుకోసం తల్లి గుర్తింపు కార్డును రెన్యువల్ చేసేందుకు వెళ్లినప్పుడల్లా తన తల్లిలా కనిపించేందుకు తలకు విగ్గు, పెదవులకు లిప్‌స్టిక్‌, ముఖానికి మేకప్‌, 1970 దశకంలో ఉపయోగించే బ్లౌజు, పొడుగు స్కర్టు, నెయిల్‌ పాలిష్‌, పాతకాలం నాటి చెవిరింగులు ధరించేవాడు. ఈ వ్యవహారంలో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. తల్లి మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా ఇంట్లోనే భద్రపరిచి, దాన్ని మమ్మీలా మార్చేశాడు.

అయితే, ఇటీవల రిజిస్ట్రీ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఓ ఉద్యోగికి అతనిపై అనుమానం వచ్చింది. వృద్ధురాలిలా ఉన్నప్పటికీ మెడ బలంగా ఉండటం, ముఖంపై ముడతలు అసహజంగా కనిపించడం, చేతులపై చర్మం ఆమె వయసుకు తగినట్లు లేకపోవడాన్ని గమనించారు. గొంతు కూడా అప్పుడప్పుడు మగవారిలా మారుతుండటంతో అనుమానం బలపడింది. ఈ విషయాన్ని మేయర్ ఫ్రాన్సెస్కో దృష్టికి తీసుకెళ్లగా, వారు పథకం ప్రకారం పింఛను ఫారాలు నింపాలని అతడిని కార్యాలయానికి పిలిపించి అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

Related posts

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?

Ram Narayana

శత్రువులను తుడిచిపెట్టేస్తాం .. ట్రంప్, నెతన్యాహుపై ఇరాన్ మత గురువు ఫత్వా

Ram Narayana

రష్యా నుంచి వెనక్కి వెళ్లిపోతున్న ఉత్తర కొరియా సైనికులు!

Ram Narayana