సుప్రీం కోర్ట్ వార్తలు

న్యాయవ్యవస్థపై ఎన్‌సీఈఆర్‌టీ ‘కుట్ర’.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

  • వివాదాస్పద పాఠ్యపుస్తకంపై తక్షణ నిషేధం 
  • న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోందంటూ సీజేఐ ఆగ్రహం
  • బేషరతుగా క్షమాపణలు చెప్పిన కేంద్రం
  • అవినీతి పాఠ్యాంశంపై కఠిన చర్యలు.. మార్చి 11న తదుపరి విచారణకు ఆదేశం

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను మంటగలిపేలా పాఠ్యపుస్తకాల్లో అభ్యంతరకర అంశాలను ప్రచురించిన ఎన్‌సీఈఆర్‌టీకి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో న్యాయవ్యవస్థలోని అవినీతిపై చేర్చిన అధ్యాయాన్ని తీవ్రంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం.. ఆ పుస్తకంపై తక్షణ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కేవలం పొరపాటు కాదు న్యాయవ్యవస్థను కించపరిచేలా చేసిన ఉద్దేశపూర్వక కుట్ర అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

బుల్లెట్ తగిలి రక్తం చిందిస్తోంది: సీజేఐ
విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అత్యంత ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘‘ఎన్‌సీఈఆర్‌టీ ప్రయోగించిన బుల్లెట్‌ తో న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. కోర్టుల విశిష్ట చరిత్రను వివరించాల్సింది పోయి వ్యవస్థను అణచివేసేలా పాఠాలు రాయడం సరికాదు’’ అని మండిపడ్డారు. యువత మనసుల్లో న్యాయవ్యవస్థ పట్ల అగౌరవం కలిగించేలా ఈ పాఠ్యాంశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులెవరో తేలేవరకు ఈ విషయాన్ని వదిలిపెట్టబోమని, జవాబుదారీతనం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

కేంద్రం బేషరుతు క్షమాపణ
కోర్టు ఆగ్రహాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బేషరుతుగా క్షమాపణలు కోరారు. ఈ పాఠ్యాంశాన్ని ప్రభుత్వం ఏమాత్రం సమర్థించడం లేదని, పబ్లిక్ నోటీసు ద్వారా క్షమాపణలు చెబుతామని వెల్లడించారు. ఇప్పటికే వివాదాస్పద పుస్తకాల పంపిణీని నిలిపివేసి, వెబ్‌సైట్ నుంచి కూడా ఆ పాఠాలను తొలగించామని కోర్టుకు వివరించారు.

కఠిన చర్యలకు ఆదేశం
ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా, సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు ఈ వివాదాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ కేసులో తదుపరి పరిణామాలు మార్చి 11న జరిగే విచారణలో వెల్లడికానున్నాయి.

ఎన్‌సీఈఆర్‌టీ క్షమాపణలు: పాఠ్యపుస్తకం నుంచి ఆ వివాదాస్పద చాప్టర్ తొలగింపు!

NCERT Apologizes Removes Controversial Chapter from Textbook
  • 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకాన్ని ఉపసంహరించుకున్న ఎన్‌సీఈఆర్‌టీ
  • న్యాయవ్యవస్థపై వివాదాస్పద అంశాలు ఉండటమే కారణం
  • జరిగిన పొరపాటుకు బహిరంగంగా క్షమాపణలు
  • సవరించిన పాఠ్యాంశాలతో కొత్త పుస్తకాల ముద్రణకు నిర్ణయం

దేశంలో పాఠ్యపుస్తకాలను రూపొందించే జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) కీలక నిర్ణయం తీసుకుంది. 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థకు సంబంధించి వివాదాస్పద అంశాలు ఉండటంతో ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ పొరపాటుపై బహిరంగంగా క్షమాపణలు కూడా కోరింది.

8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలోని నాలుగో అధ్యాయంలో భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఓ పాఠ్యాంశం ఉంది. న్యాయమూర్తుల కొరత, కేసుల విచారణలో జాప్యం, మౌలిక సదుపాయాల లేమి వంటి అంశాలను ఇందులో వివరించారు. అయితే, ఈ విశ్లేషణలో భాగంగా ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే ప్రస్తావన ఉండటం తీవ్ర వివాదానికి దారితీసింది. ఇది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.

విమర్శల నేపథ్యంలో తక్షణమే స్పందించిన ఎన్‌సీఈఆర్‌టీ ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని స్పష్టం చేసింది. కొన్ని వాక్యాలు తప్పుగా అర్థం వచ్చేలా ఉన్నాయని, పొరపాటు జరిగినందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. వెంటనే మార్కెట్ నుంచి ఆ పుస్తకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. త్వరలోనే సవరించిన పాఠ్యాంశాలతో కొత్త పుస్తకాలను ముద్రిస్తామని తెలిపింది. సవరించిన పాఠ్యపుస్తకాల డిజిటల్ కాపీలను త్వరలో తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఎన్‌సీఈఆర్‌టీ వెల్లడించింది. 

Related posts

గవర్నర్లకు గడువు.. కీలక తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు!

Ram Narayana

సుప్రీంకోర్టులోనూ వైసీపీకి ఎదురుదెబ్బ…

Ram Narayana

సంసారంలోని కీచులాటలు క్రూరత్వం కిందికి రావు: సుప్రీంకోర్టు!

Ram Narayana