మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ ఆదివారం భీకర ప్రతీకార చర్యలకు దిగింది. లెబనాన్లోని హెజ్బొల్లా, ఇరాక్లోని మిలీషియా గ్రూపులతో కలిసి డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఈ దాడులతో ఇజ్రాయెల్లోని సుమారు 100 పట్టణాల్లో రోజంతా సైరన్లు మోగుతూనే ఉన్నాయి.
బీర్షెబాలోని నియోట్ హొవావ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఏడీఏఎంఏ రసాయన పరిశ్రమపై ఇరాన్ క్షిపణులు పడటంతో భారీ పేలుళ్లు సంభవించాయి. పరిశ్రమలో మంటలు చెలరేగి విషవాయువులు వెలువడటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, తలుపులు, కిటికీలు మూసివేయాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు టెల్ అవీవ్, జెరూసలెం, హైఫా వంటి ప్రధాన నగరాల్లోనూ భారీ పేలుళ్లు సంభవించాయి. హైఫాలోని చమురు రిఫైనరీపై దాడితో మంటలు ఎగసిపడ్డాయి. ఇజ్రాయెల్తో పాటు కువైట్, బహ్రెయిన్, యూఏఈ, సౌదీ అరేబియాలపైనా ఇరాన్ దాడులు జరిపింది. కువైట్లోని సైనిక స్థావరంపై దాడిలో 10 మంది గాయపడ్డారు.
ఇదే సమయంలో ఇరాన్పైనా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. టెహ్రాన్, ఇస్ఫహాన్, షిరాజ్ నగరాలపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్లో మృతుల సంఖ్య 2,076కు చేరినట్లు తెలుస్తోంది. టెహ్రాన్లోని అల్ అరబీ టీవీ కార్యాలయం, ఇస్ఫహాన్ యూనివర్సిటీ క్యాంపస్ కూడా దాడుల బారిన పడ్డాయి. పరస్పర దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.