- కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోదీ 45 గంటల ధ్యానం
- దీనిపై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ సెటైరికల్ ట్వీట్
- ఈ పోస్ట్ను రీట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన 45 గంటల ధ్యానంపై కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కెమెరాల ముందు పబ్లిసిటీ కోసం ధ్యానం చేస్తున్నట్లు ఉందని ఆయన ట్వీట్ చేశారు.
దీనికి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ చేస్తోంది ‘మెడిటేషన్ కాదు.. ఎడిటేషన్’ అంటూ ఓ సెటైరికల్ ఫొటోను జోడించారు. ఇది అన్నింటినీ వివరిస్తుంది! అనే క్యాప్షన్తో కాంగ్రెస్ నేత చేసిన ఈ పోస్ట్ను రీట్వీట్ చేస్తూ ఆ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.
కాగా, ప్రస్తుతం కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది. స్వామి వివేకానంద ధ్యానం చేసిన వివేకానంద రాక్ మెమోరియల్లో మోదీ మెడిటేషన్ కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం ధ్యాన ముద్రలోకి వెళ్లిన ఆయన.. శనివారం మధ్యాహ్నం వరకు అంటే దాదాపు 45 గంటల పాటు ఇక్కడే రేయింబవళ్లు ధ్యానం చేయనున్నారు.
మోదీ’ధ్యానం’పై మల్లికార్జున్ ఖర్గే…
కన్యాకుమారిలోని ధ్యానమందిరంలో జూన్ 1వ తేదీ వరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ’ధ్యానం’ లో కూర్చోనుండటంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారంనాడు విమర్శలు గుప్పించారు.
రాజకీయాలను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు. భగవంతుడి మీద అంతగా విశ్వాసం ఉంటే ఆ ధ్యానం ఏదో ఇంట్లోనే చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.
”రాజకీయాలు, మతం రెండింటినీ ఒకే గాట కట్టరాదు. వేర్వేరుగానే వాటిని ఉంచాలి. ఒక మతానికి చెందిన వ్యక్తి మీతో ఉండొచ్చు, మరొకరు మీకు దూరంగా ఉండొచ్చు. మతపరమైన భావోద్వేగాలను ఎన్నికలతో ముడిపెట్టరాదు. ఆయన (మోదీ) కన్యాకుమారి వెళ్లి డ్రామా అడబోతున్నారు. ఇందుకోసం భారీగా పోలీసు అధికారులను విధుల్లో ఉంచాల్సి వస్తుంది. తద్వారా ఎంతో ప్రజాధనం వృథా అవుతుంది. మీరు చేసే ‘షో’ వల్ల దేశానికి కీడు జరుగుతుంది. మీకు భగవంతుడి మీద విశ్వాసం ఉంటే ఆ పనేదే ఉంట్లోనే చేసుకోవచ్చు” అని ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు.