అంతర్జాతీయం

నైజీరియాలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 21 మంది క్రీడాకారులు మృతి

నైజీరియాలో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 21 మంది క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ క్రీడా పోటీలలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ అలసట లేదా అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ (ఎఫ్ఆర్‌ఎస్‌సి) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంతో ఏ వాహనానికీ సంబంధం లేదు. క్రీడాకారులు ప్రయాణిస్తున్న బస్సు మాత్రమే ప్రమాదానికి గురైంది. రాత్రిపూట సుదీర్ఘ ప్రయాణం కారణంగా డ్రైవర్ అలసిపోవడం లేదా అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఎఫ్ఆర్‌ఎస్‌సి ప్రతినిధులు తెలిపారు. సుమారు 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒగున్ రాష్ట్రంలో జరిగిన 22వ జాతీయ క్రీడా ఉత్సవాల నుంచి అథ్లెట్లు ఉత్తర నైజీరియాలోని కానో నగరానికి తిరిగి వస్తున్నారు. వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ నుంచి పశ్చిమ ఆఫ్రికా సంప్రదాయ కుస్తీ వరకు అనేక క్రీడలు జరిగిన ఈ పోటీలు దేశ ఐక్యత, బలం, స్థితిస్థాపకతకు నిదర్శనమని అధ్యక్షుడు బోలా టినుబు ఇటీవల వ్యాఖ్యానించారు. నైజీరియాలో రహదారుల నిర్వహణ సరిగా లేకపోవడం, వాహనాల అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన తదితర కారణాల వల్ల తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గత ఏడాది నైజీరియాలో 9,570 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, వాటిలో 5,421 మంది మరణించారని ఎఫ్ఆర్‌ఎస్‌సి గణాంకాలు తెలియజేస్తున్నాయి.

Related posts

ఆఫ్ఘనిస్థాన్‌తో అన్ని బంధాలు కట్ చేసుకున్నట్టు పాకిస్థాన్ ప్రకటన…

Ram Narayana

సంకెళ్లతో న్యూయార్క్‌కు మదురో!

Ram Narayana

హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం… ఇజ్రాయెల్ ప్రకటన!

Ram Narayana