సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానించడం తగదన్న ఎమ్మెల్యే
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్న రేవంత్
వీరికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని వ్యాఖ్య…
ఇటీవల ఒక పత్రిక వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి…గతంలో అసెంబ్లీ వేదికగా జర్నలిస్టులను ,ప్రత్యేకించి యూట్యూబర్లను టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు జర్నలిస్టులపై విమర్శలు గుప్పిస్తున్నారు …దీనిపై అనుకూల ప్రతికూల వాదనలు వినిపిస్తున్నాయి…అయితే అనూహ్యంగా కాంగ్రెస్ కే చెందిన మునుగోడు శాసనసభ్యులు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి జర్నలిస్టులపై ముఖాయమంత్రి మాటలను ఖండించడమే కాకుండా వారికీ తన మద్దతు ఉంటుందని ప్రకటించడం గమనార్హం …
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సామాజిక బాధ్యతతో పని చేసే వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులను అవమానించడం తగదని సూచించారు. ఇలాంటి కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదని అన్నారు. సమాజం కోసం నిబద్ధతతో పని చేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.
ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పని చేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప… అవమానించడం సరికాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదటి నుంచి శక్తిమేరకు పని చేస్తోందని చెప్పారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సోషల్ మీడియా జర్నలిస్టులపై మండిపడ్డారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రధాన మీడియా జర్నలిస్టుల నుంచి వీరిని వేరు చేయాలని సూచించారు. రోడ్ల మీద తిరిగేవాడు, ఎక్కువ తిట్లు వచ్చినోడు జర్నలిజం ముసుగు తొడుక్కుని అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు.