ఎలక్షన్ కమిషన్ వార్తలుజాతీయ వార్తలు

రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణలు ఖండించిన ఈసీ …ఈసీ వివరణ వింటుంటే నవ్వొస్తుందన్న కాంగ్రెస్ …!

ఈసీ ఖండన …కాంగ్రెస్ స్పందన ఈ విధంగా ఉంది …

రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ’ ఆరోపణలపై సీఈసీ స్పందన

అలాంటి బెదిరింపులకు మేం లొంగిపోం…

Gyanesh Kumar Responds to Rahul Gandhis Vote Theft Allegations
  • కాంగ్రెస్ పార్టీ ‘ఓట్ల చోరీ’ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఈసీ
  • ఓటర్లకు ఎల్లప్పుడూ బండరాయిలా అండగా ఉంటామని స్పష్టీకరణ
  • బీహార్ ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పక్షపాతం లేదన్న సీఈసీ
  • తప్పుడు ప్రచారాలతో తమ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ
  • ఓటర్ల ఫోటోలు బహిరంగంగా ప్రదర్శించడం వ్యక్తిగత గోప్యతకు భంగమేనని ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఓట్ల చోరీ’ ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా ఖండించింది. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తాము రాజీపడబోమని, ఓటర్లకు ఎల్లప్పుడూ బలమైన అండగా నిలుస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ మాట్లాడారు.

“ఎన్నికల సంఘం భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయాలని చూస్తే, మేము అలాంటి బెదిరింపులకు లొంగిపోమని స్పష్టం చేస్తున్నాం. పేద, ధనిక, వృద్ధులు, మహిళలు, యువత అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఓటర్లకు ఈసీ నిర్భయంగా అండగా నిలుస్తుంది” అని ఆయన ఉద్ఘాటించారు.

బీహార్‌లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. రాజకీయ పార్టీల మధ్య తాము ఎలాంటి వివక్ష చూపబోమని, ఏ పార్టీకి చెందిన వారైనా సరే తమ రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తించడంలో వెనకడుగు వేయబోమని తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారులు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు పారదర్శకంగా పనిచేస్తున్నారని, వారు ధృవీకరించిన పత్రాలు, వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు.

“క్షేత్రస్థాయిలో పార్టీలు నియమించిన ప్రతినిధులు ధృవీకరించిన విషయాలు రాష్ట్రస్థాయి లేదా జాతీయస్థాయి నేతలకు చేరడం లేదో, లేక వాస్తవాలను పక్కనపెట్టి వారిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం” అని జ్ఞానేశ్ కుమార్ అన్నారు.

కొందరు నేతలు ఓటర్ల ఫోటోలను బహిరంగంగా ప్రదర్శించడంపై సీఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని హెచ్చరించారు. ఎన్నికల సంఘంపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఈసీ వివరణ వింటుంటే నవ్వొస్తోంది: జైరాం రమేశ్!

  • బీహార్ ఓటర్ల జాబితాపై ఈసీ వివరణను తోసిపుచ్చిన కాంగ్రెస్
  • రాహుల్ గాంధీ ప్రశ్నలకు ఈసీ సరైన సమాధానం చెప్పలేదని జైరాం రమేశ్ విమర్శ
  • ఈసీ అసమర్థత, పక్షపాతం బట్టబయలయ్యాయని తీవ్ర ఆరోపణ

బీహార్ ఓటర్ల జాబితా సవరణలో ‘ఓట్ల చోరీ’ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇచ్చిన వివరణను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈసీఐ వివరణ ఏమాత్రం సంతృప్తికరంగా లేదని, వారి వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా ఉన్నాయని ఎద్దేవా చేసింది. ఎన్నికల సంఘం అసమర్థత, పక్షపాత వైఖరితో పూర్తిగా బట్టబయలైందని ఆరోపిస్తూ దాడిని మరింత ఉధృతం చేసింది.

నేడు ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగిందని, తాము రాజ్యాంగబద్ధంగా పనిచేసే స్వతంత్ర సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు తెలిపేందుకు ఇంకా 15 రోజుల సమయం ఉందని, రాజకీయ పార్టీలు తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని తెలిపారు. తమను ఎవరూ భయపెట్టలేరని ఆయన వ్యాఖ్యానించారు.

సీఈసీ ప్రెస్ మీట్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడికి దిగారు. “లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన సూటి ప్రశ్నలకు సీఈసీ అర్థవంతంగా సమాధానం ఇవ్వలేదు. ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి” అని విమర్శించారు. అధికారికంగా కాకుండా వర్గాల ద్వారా సమాచారం లీక్ చేసే ఈసీ, ఇప్పుడు నేరుగా మాట్లాడటం ఇదే మొదటిసారని ఆయన చురక అంటించారు.

“రాహుల్ గాంధీకి సీఈసీ బెదిరింపుల విషయానికొస్తే, ఈసీ డేటాలోని వాస్తవాలనే రాహుల్ ప్రస్తావించారు. ఎన్నికల సంఘం తన అసమర్థతతోనే కాకుండా, పచ్చి పక్షపాతంతో కూడా పూర్తిగా బట్టబయలైంది” అని జైరాం రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కొంతకాలంగా రాహుల్ గాంధీ, బీహార్ ఓటర్ల జాబితా విషయంలో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఈసీ కుమ్మక్కైందని ఆరోపిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి 65 లక్షల మంది పేర్లను తొలగించిన వివరాలను బయటపెట్టాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన మూడు రోజుల తర్వాత ఈసీ ఈ ప్రెస్ మీట్ పెట్టడం గమనార్హం. ఈసీ వివరణతో ప్రతిపక్షాలు ఏకీభవించకపోవడంతో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.

Related posts

రతన్ టాటా జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు !

Ram Narayana

వైద్యులు మందుల చీటీలపై రాసే రాత అర్థం కావడం లేదా?.. ఇకపై ఆ ఇబ్బంది లేదు..!

Ram Narayana

పనిగంటల అంశంపై కేంద్రం స్పందన…

Ram Narayana