- చైనాతో వాణిజ్య యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
- బీజింగ్ పోటీకి వస్తే వినాశనం తప్పదని గట్టి హెచ్చరిక
- తమ వద్ద అద్భుతమైన కార్డులు ఉన్నాయని వ్యాఖ్య
- ఆ కార్డులు వాడితే చైనా తట్టుకోలేదని స్పష్టీకరణ
- ఈ ఏడాది చివరిలో చైనా పర్యటనకు వెళ్తానని వెల్లడి
చైనాతో కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజింగ్తో మంచి సంబంధాలు కోరుకుంటున్నప్పటికీ, వాణిజ్య వివాదాల్లో తమదే పైచేయి అని ఆయన స్పష్టం చేశారు. తమతో పోటీ పడాలని చూస్తే చైనాకు వినాశనం తప్పదని పరోక్షంగా, గట్టిగా హెచ్చరించారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, వాణిజ్య పోరులో చైనా వద్ద కొన్ని కార్డులు ఉంటే, తమ వద్ద అంతకంటే అద్భుతమైన కార్డులు ఉన్నాయని అన్నారు. “వాళ్ల దగ్గర కొన్ని కార్డులు ఉన్నాయి. కానీ మా దగ్గర అంతకంటే గొప్ప కార్డులు ఉన్నాయి. అయితే నేను వాటితో ఆడాలనుకోవడం లేదు. ఒకవేళ నేను ఆ కార్డులతో ఆడితే, చైనా నాశనమవుతుంది. అందుకే ప్రస్తుతానికి ఆ పని చేయను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కొన్ని రకాల అరుదైన ఖనిజాల సరఫరాను నిలిపివేయడం లాంటి చర్యలకు చైనా పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అలాంటి పరిస్థితులు తలెత్తితే చైనాపై 200 శాతం వరకు సుంకాలు విధించడానికి కూడా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. వాణిజ్యపరంగా తమ ఆధిపత్యాన్ని బీజింగ్ సవాలు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో, ఇరు దేశాల మధ్య సత్సంబంధాల ప్రాముఖ్యతను కూడా ట్రంప్ ప్రస్తావించారు. “ఈ ఏడాది చివర్లో గానీ, ఆ తర్వాత కొద్దికాలానికి గానీ నేను చైనా పర్యటనకు వెళ్తాను. రెండు దేశాల మధ్య అద్భుతమైన సంబంధాలు ఉండబోతున్నాయి” అని ఆయన తెలిపారు. ప్రస్తుతం వాణిజ్యపరంగా విభేదాలు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో సంబంధాలు మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మర్యాద తగ్గిందో జాగ్రత్త.. ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్

- మాకు మర్యాద ఇవ్వకుంటే వడ్డింపులు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు
- చైనా కంపెనీలను ప్రోత్సహిస్తున్నాయని పలు దేశాలపై ఆరోపణలు
- అమెరికా చిప్ ఎగుమతులపై భారీగా పన్నులు విధిస్తున్నాయని ఫైర్
అమెరికాకు మర్యాద ఇవ్వని దేశాలపై టారిఫ్ లు విధించే విషయంలో వెనక్కి తగ్గబోనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అగ్రరాజ్యంలోని పలు చిప్ కంపెనీల పట్ల విదేశాల్లో తీవ్ర వివక్ష కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ లో తాజాగా ఓ పోస్టు పెట్టారు.
అమెరికాకు చెందిన చిప్ కంపెనీల ఎగుమతులపై వివిధ దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. అదే సమయంలో చైనా కంపెనీల పట్ల అవే దేశాలు ఉదారంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ వివక్షకు ఇకపై ముగింపు పలకాలని హెచ్చరించారు. అమెరికా పట్ల కనీస మర్యాద చూపకుండా తమ కంపెనీలపై భారీగా వసూలు చేస్తున్న సుంకాలను వెంటనే సవరించాలని సూచించారు.
లేనిపక్షంలో అమెరికా అధ్యక్షుడిగా ఆయా దేశాలపై భారీ మొత్తంలో టారిఫ్ లు విధిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. తమ దేశానికే ప్రత్యేకమైన అత్యున్నత సాంకేతికత, చిప్ ల ఎగుమతిపై ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. అమెరికా, అమెరికన్ కంపెనీలు ఇకపై ప్రపంచ దేశాలకు పిగ్గీ బ్యాంక్ లా ఉండబోవని ట్రంప్ స్పష్టం చేశారు.