తెలంగాణ రాజకీయ వార్తలు ..

రూ. 10 కోట్లకు బండి సంజయ్‌పై కేటీఆర్ పరువు నష్టం దావా!

  • హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన కేటీఆర్
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారన్న కేటీఆర్
  • లీగల్ నోటీసుకు స్పందించకపోవడంతో కోర్టులో పిటిషన్

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బండి సంజయ్ ఎటువంటి ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేశారని, దీనివల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని ఆరోపిస్తూ కేటీఆర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. 

తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతూ కేటీఆర్ తరఫు న్యాయవాదులు ఆగస్టు 11న బండి సంజయ్‌కు లీగల్ నోటీసు పంపారు. అయితే, ఆ నోటీసులకు బండి సంజయ్ స్పందించకపోవడంతో పాటు, క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో కేటీఆర్ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే ఆయన సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ దావాలో కేటీఆర్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలకు గాను బేషరతుగా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో తన పరువుకు నష్టం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు, ప్రసంగాలు, ప్రచురణలు చేయకుండా బండి సంజయ్‌ను నిరోధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరారు. అలాగే, ఇప్పటికే ఆన్‌లైన్ వేదికలు, సామాజిక మాధ్యమాలు, ఇతర వార్తా మాధ్యమాలలో ఉన్న పరువు నష్టపరిచే కథనాలు, వీడియోలు, పోస్టులను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.

కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై స్పందించిన బండి సంజయ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. పరువు నష్టం దావాను తాను న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. కేటీఆర్ వలె తాను ఎప్పుడూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడనని పేర్కొన్నారు. విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొంటానని ఆయన స్పష్టం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో పాటు రూ. 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్‌లో కేటీఆర్ పేర్కొన్నారు. 

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం బండి సంజయ్‌కి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 15న విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

Related posts

కాంగ్రెస్ టిక్కెట్ కేటాయింపులు.. తెలంగాణ నేతలకు ఢిల్లీ నేత కీలక సూచన

Ram Narayana

రాష్ట్రం వచ్చాక ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోలేదు.. మేం చీటర్స్ కాదు.. ఫైటర్స్: కేటీఆర్​

Ram Narayana

కాంగ్రెస్‌ ప్రభుత్వం మనకంటే బాగా చేయాలని కోరుకుందాం!: హరీశ్ రావు

Ram Narayana