- తనను 73 రోజులు జైల్లో ఉంచారన్న మిథున్ రెడ్డి
- సీసీ కెమెరాలు పెట్టి వేధించారని మండిపాటు
- కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కనీస వసతులు కూడా కల్పించలేదని విమర్శ
తెలుగుదేశం ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను జైలులో ఒక టెర్రరిస్టు మాదిరిగా చూశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే బెయిల్పై విడుదలైన ఆయన, తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తన అరెస్టు, జైలు జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కేవలం పైశాచిక ఆనందం కోసమే తనను అక్రమ కేసులతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు.
“నన్ను 73 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఆ సమయంలో నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టారు. విజయవాడ నుంచి నేరుగా పర్యవేక్షించారు. కనీసం జైలు అధికారులు కూడా నాతో మాట్లాడటానికి భయపడ్డారు. ఒక ఉగ్రవాదిని చూసినట్టుగా నన్ను ట్రీట్ చేశారు” అని మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు తనకు కనీస వసతులు కూడా కల్పించలేదని, తనను కలవడానికి వచ్చిన వారిపై కూడా నిఘా పెట్టారని ఆయన వివరించారు. ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి తనను ఇలాగే ఇబ్బందులకు గురిచేస్తోందని, 2014-2019 మధ్య కాలంలో కూడా తనపై అక్రమ కేసులు పెట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనులను పక్కనపెట్టి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కేసుల ద్వారా తన తల్లిదండ్రులను మానసిక వేదనకు గురిచేశారని అన్నారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను వెనక్కి తగ్గేది లేదని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అక్రమ కేసులకు తాను భయపడనని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కేసులన్నీ ఒక్క రోజులో పోయేవే: మిథున్ రెడ్డి

- తనపై అక్రమ కేసులు పెట్టారన్న మిథున్ రెడ్డి
- జగన్ కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని వ్యాఖ్య
- రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని ధీమా
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి, బెయిల్పై జైలు నుంచి విడుదలైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అధికార కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనపై పెట్టినవి అక్రమ కేసులని, వీటిని చూసి భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జైల్లో తనను ఒక ఉగ్రవాదిలా చూశారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్రంలో మళ్లీ రాబోయేది జగనన్న ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం మిథున్ రెడ్డి ఓ ఛానెల్తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని వేధించడం, మాపై కేసులు పెట్టడం మామూలే. కేవలం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు పెట్టారు. ఇలాంటి వాటికి భయపడతామని అనుకుంటే అది వారి భ్రమే అవుతుంది. ఇవన్నీ ఒక్కరోజులోనే వీగిపోయే కేసులు” అని ఆయన కొట్టిపారేశారు.
రెండున్నర నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చిందని, అక్కడ తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని మిథున్ రెడ్డి తెలిపారు. అయితే, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు, తమ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలిచారని పేర్కొన్నారు. “మా అధినేత జగన్ మా వెంటే ఉన్నారు. మా కుటుంబానికి ఎవరికీ ఇవ్వని గుర్తింపు ఇచ్చారు. ఆయన కోసం, మళ్లీ జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటాం, ఎన్ని ఇబ్బందులైనా భరిస్తాం” అని ఆయన అన్నారు. కోర్టు ఆంక్షల కారణంగా కేసు గురించి ఎక్కువగా మాట్లాడలేనని, ఎన్ని కష్టాలు పెట్టినా అధైర్యపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు.