జాతీయ వార్తలు

పుతిన్‌కు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం…

  • రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన వ్లాదిమిర్ పుతిన్
  • రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం పలికిన ముర్ము, మోదీ
  • ప్రధాని మోదీతో కీలక ద్వైపాక్షిక చర్చలు
  • రక్షణ, ఇంధన రంగాలపై ప్రధానంగా చర్చించే అవకాశం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయనకు రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఇరు దేశాల ఉన్నతాధికారులను నేతలు పరస్పరం పరిచయం చేసుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ హైదరాబాద్ హౌస్‌లో అధికారిక చర్చలు జరపనున్నారు. రక్షణ, ఇంధన సహకారం, ప్రాంతీయ భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై వీరి మధ్య చర్చలు జరగనున్నాయి. సమావేశం అనంతరం ఇరు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడతారు. అనంతరం పుతిన్ వాణిజ్య, పెట్టుబడుల బలోపేతం లక్ష్యంగా జరిగే ఒక బిజినెస్ కార్యక్రమంలో పాల్గొంటారు.

గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ వ్యక్తిగతంగా వెళ్లి స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, కరచాలనం చేసుకున్నారు. అక్కడి నుంచి ప్రధాని అధికారిక నివాసం వరకు ఇద్దరూ ఒకే వాహనంలో ప్రయాణించడం వారి మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనంగా నిలిచింది. అనంతరం పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ తన నివాసంలో ప్రైవేట్ విందు ఏర్పాటు చేశారు.

ఇక‌, పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలోని ప్రధాన రహదారులను భారత్-రష్యా జెండాలతో, ప్రత్యేక లైటింగ్‌తో అలంకరించారు. ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చే విందులో పుతిన్ పాల్గొననున్నారు.

రాజ్‌ఘాట్‌ను సందర్శించిన పుతిన్‌.. గాంధీజీ సమాధి వద్ద నివాళి…

Vladimir Putin Visits Rajghat Pays Tribute to Gandhi
  • రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు
  • రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం పలికిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము
  • రక్షణ, ఇంధన రంగాలపై ప్రధాని మోదీతో కీలక చర్చలు జరపనున్న పుతిన్

భారత పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శుక్రవారం ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పుతిన్ వెంట కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. అనంతరం పుతిన్ అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.

అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్‌కు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులను ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ హైదరాబాద్ హౌస్‌లో అధికారిక చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో రక్షణ, ఇంధన రంగాల్లో సహకారం, ప్రాంతీయ భద్రత, దీర్ఘకాలిక ఆర్థిక భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ చర్చలు ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

జనగణనకు గెజిట్‌ విడుదల చేసిన కేంద్రం

Ram Narayana

పాత పగతో ఘాతుకం.. స్కూటర్‌ను బీఎండబ్ల్యూతో ఢీకొట్టిన మైనర్!

Ram Narayana

ఇండిగో విమాన సర్వీసుల్లో 10 శాతం కోత విధించిన కేంద్రం…

Ram Narayana