జాతీయ వార్తలు

ఉచితాలపై మోదీ అభిప్రాయం ఇది : కేంద్ర మంత్రి పీయుష్ గోయల్

  • ఉచితాలపై ఆధారపడే విధానంపై ప్రధానికి నమ్మకం లేదన్న పీయుష్ గోయల్
  • ప్రభుత్వమే అన్నీ చేస్తుందన్న భావన తగ్గి, ప్రజలు కూడా బాధ్యత తీసుకునే పథకాలు ఉండాలన్నదే ప్రధాని ఆలోచనని వెల్లడి
  • పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాలను ప్రధాని స్వయంగా రూపొందించారన్న పీయూష్ గోయల్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచిత పథకాల పంపిణీ కంటే ప్రజలను వివిధ పథకాల ద్వారా సాధికారికంగా తీర్చిదిద్దడంపై విశ్వాసం కలిగి ఉన్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ క్రమంలోనే పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి పథకాలను ప్రధాని స్వయంగా రూపొందించారని, అవి ఆయన ఆలోచనా విధానానికి ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నిర్వహించిన ‘వైబ్రంట్ గుజరాత్ రీజినల్ కాన్ఫరెన్స్’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వాలు అందించే ఉచితాలపై ఆధారపడే విధానంపై ప్రధానికి నమ్మకం లేదని గోయల్ స్పష్టం చేశారు. ప్రభుత్వమే అన్నీ చేస్తుందన్న భావన తగ్గి, ప్రజలు కూడా బాధ్యత తీసుకునే విధంగా పథకాలు ఉండాలన్నదే ప్రధాని ఆలోచన అని తెలిపారు.

పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రధాని మోదీ పౌరులకు సాధికారత కల్పించారని ఆయన తెలిపారు. ఈ పథకం కింద సౌర ఫలకాల ఏర్పాటు కోసం వినియోగదారుడు కూడా కొంత ఖర్చును భరించాల్సి ఉంటుందని, ఇలాంటి పథకాలలో ప్రజల వ్యక్తిగత భాగస్వామ్యం ఉండాలని ఆయన చెప్పారు. ప్రభుత్వమే అన్నీ చేయాలని ప్రజలు ఆశించకూడదని, ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

ఒక పథకం విజయవంతంగా అమలవ్వాలంటే ప్రభుత్వ మద్దతుతో పాటు పౌరుల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అన్నారు. విద్యుత్‌ను పూర్తిగా ఉచితంగా ఇచ్చినప్పుడు భవిష్యత్తులో కోతలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Related posts

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మళ్లీ సాంకేతిక సమస్య.. గంటల తరబడి ప్రయాణికుల అవస్థలు…

Ram Narayana

 మంచులో 12 మంది… 3 గంటలు శ్రమించి కాపాడిన పోలీసులు..!

Ram Narayana

పీఎఫ్ డబ్బు విత్‌డ్రా ఇప్పుడు చాలా ఈజీ.. మారిన నిబంధనలు ఇవే!

Ram Narayana