అంతర్జాతీయం

ఉత్తర కొరియా వారసురాలిగా ‘కిమ్ జు యే’.. 13 ఏళ్లకే దేశ పగ్గాలు.. ముహూర్తం ఫిక్స్!

  • కిమ్ వారసురాలిగా కుమార్తె జు యే పేరు ఖరారు
  • ఇక ఆమె శిక్షణలో లేరని, వారసురాలిగా నియమితులయ్యారని ఊహాగానాలు
  • దక్షిణ కొరియా నిఘా సంస్థ కీలక నివేదిక
  • రాబోయే వర్కర్స్ పార్టీ సమావేశంలో అధికారిక ప్రకటనకు అవకాశం
  • ఉత్తర కొరియా చరిత్రలో తొలి మహిళా పాలకురాలిగా రికార్డు

ఉత్తర కొరియా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిగా కుమార్తె కిమ్ జు యేను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఆమె వారసత్వ శిక్షణలో ఉన్నారని భావించగా, ఇప్పుడు ఆ దశను దాటి “వారసురాలిగా నియమితులయ్యే” (designated successor) స్థాయికి చేరుకున్నారని దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ (NIS) అంచనా వేసింది. ఈ మేరకు దక్షిణ కొరియా చట్టసభ సభ్యులకు NIS రహస్య నివేదిక సమర్పించింది.

NIS నివేదిక ప్రకారం కిమ్ జు యే కేవలం బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, కొన్ని ప్రభుత్వ విధానాలపై తన అభిప్రాయాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల జరిగిన కీలక సైనిక కార్యక్రమాలు, ప్రభుత్వ సమావేశాల్లో ఆమెకు తండ్రి కిమ్ జోంగ్ ఉన్ తర్వాత అత్యంత ఉన్నత స్థాయి ప్రోటోకాల్ లభించడాన్ని బట్టి ఆమె హోదా పెరిగినట్లు స్పష్టమవుతోందని ఎన్ఐఎస్ విశ్లేషించింది. సుమారు 13 ఏళ్ల వయసున్న జు యే, 2022 నవంబర్‌లో తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం వద్ద ప్రపంచానికి కనిపించారు.

ఈ నెల చివర్లో జరగనున్న వర్కర్స్ పార్టీ 9వ కాంగ్రెస్ సమావేశంలో కిమ్ జు యేకు అధికారికంగా ఏదైనా పదవి లేదా బిరుదు ప్రకటించే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. అదే జరిగితే, 1948లో దేశం ఏర్పడిన నాటి నుంచి పురుషులకే పరిమితమైన కిమ్ కుటుంబ పాలనకు తెరపడి, తొలిసారి ఒక మహిళ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమవుతుంది. అయితే ఈ విషయంపై ఉత్తర కొరియా అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Related posts

షేక్ హసీనాకు ఆశ్రయంపై బ్రిటన్ ఏం చెబుతోంది?

Ram Narayana

పాలస్తీనాకు మద్దతుగా ఇటలీలో హింస.. భగ్గుమన్న నిరసనలు!

Ram Narayana

తన వారసుడిపై స్పష్టతనిచ్చిన దలైలామా

Ram Narayana