లొంగిపోయిన మావోయిస్టులు సీపీఐలో చేరండి..
-సిపిఐ రాష్ట్రకార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని బహిరంగ ఆహ్వానం
ప్రజాబలంలేని అతికొద్దిమందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమ సమాజాన్ని ప్రజాసామ్యబద్ధంగా సాధించుకుందామని, ఇందుకు కలిసి పని చేసేందుకు జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు మాతృ పార్టీ సీపీఐలో చేరాలని బహిరంగంగా సాధార ఆహ్వానం పలికారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్లో ప్రారంభమయ్యాయి. సీపీఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఎస్.బాల్రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా జాతీయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ, సీపీఐ సెంట్రల్ కమిషన్ ఛైర్మెన్ డాక్టర్ కె.నారాయణ హజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ తన బలమేమిటో నిరూపించుకోవడమే కాకుండా తమతో పొత్తు లేకపోతే ఏమి జరుగుతుందో ఆయా పార్టీలకు ఒక జలక్ ఇచ్చామని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డితోనే తేల్చుకుంటాం..!!
సీపీఐ ఎవరితో పొత్తు పెట్టుకున్న ఆ..ధర్మాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తుందని, కాని ఇతర పార్టీలు మాత్రం పాటించడం లేదని కూనంనేని సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మానికి విఘాతం కల్గించిందన్నారు. రానున్న ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆయనతోనే స్వయంగా తేల్చుకుంటామని కూనంనేని స్పష్టం చేశారు. తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ప్రయోజనాలు పొందాయి తప్పితే వారితో తమకు ఒరగబెట్టింది ఏమిలేదన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్తో ఇక మీదట పొత్తు ఉన్నా, లేకపోయినా ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయనున్నట్లు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.