రొమ్ము క్యాన్సర్ కేవలం మహిళలకే వస్తుందనుకుంటే పొరపాటే. పురుషులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారని, సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. హైదరాబాద్లోని ఈఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీ నిర్వహించిన విశ్లేషణలో ఈ ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది.
2019-2025 మధ్య కాలంలో నమోదైన కేసులను పరిశీలించగా చాలామంది పురుషులు వ్యాధి ముదిరిన తర్వాతే చికిత్స కోసం ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నట్లు తేలింది. అధ్యయనం చేసిన 15 మంది బాధితుల్లో దాదాపు 60 శాతం మంది మూడో దశలో, మరో 26 శాతం మంది నాలుగో దశలో క్యాన్సర్తో బాధపడుతున్నారు. కేవలం 13 శాతం మంది మాత్రమే వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించగలిగారు. పురుషుల్లో ఇది అరుదుగా కనిపించే క్యాన్సర్ అయినప్పటికీ, ఆలస్యంగా గుర్తించడం వల్లే చికిత్స సంక్లిష్టంగా మారుతోంది.
సాధారణంగా పురుషుల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ల స్థాయిలు పెరగడం, కాలేయ సంబంధిత సమస్యలు, అధిక బరువు, జన్యుపరమైన కారణాలతో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రొమ్ము భాగంలో గడ్డలు, చనుమొనలు లోపలికి వెళ్లడం, చర్మం రంగులో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి 100 రొమ్ము క్యాన్సర్ కేసుల్లో ఒకటి పురుషుల్లోనే ఉంటోంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ ముప్పు అధికంగా ఉన్నందున, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మేలని అంతర్జాతీయ సంస్థలు సిఫార్సు చేస్తున్నాయి. వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే, ఆధునిక వైద్య విధానాలతో అంత సులభంగా కోలుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.